ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్లతోపాటు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇవ్వాలని ఆదేశం
రాష్ట్రాలు స్పందించకుంటే నేరుగా రంగంలోకి జలశక్తి శాఖ
పూర్తి సమాచారంతోనే అపెక్స్ కౌన్సిల్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లతోపాటు వాటికి జారీ చేసిన పర్యావరణ అనుమతుల వివరాలివ్వాలని ఇటీవలే రెండు రాష్ట్రాలకు లెటర్లు రాసింది. గడువులోగా సమాధానం ఇవ్వకుంటే కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగే అవకాశముంది. 2014 జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధిత రివర్ బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది. అవి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేయాలని, పూర్తి అనుమతుల తర్వాతే పనులు చేపట్టాలని ఇప్పటికే రెండు రాష్ట్రాలను ఆదేశించింది. పూర్తి సమాచారంతోనే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలనే నిర్ణయానికొచ్చింది.
బండి సంజయ్ లెటర్తో కదిలిన జలశక్తి శాఖ
ఏపీ ప్రభుత్వం శ్రీశైలంపై తలపెట్టిన సంగమేశ్వరం లిఫ్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టులు అక్రమమని, ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని చేపడుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే ఆ ప్రాజెక్టులు ఆపాలంటూ కేఆర్ఎంబీకి సూచించారు. ఈ క్రమంలో మన రాష్ట్రం సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడుపై ఫిర్యాదు చేయగా, కృష్ణా, గోదావరిపై తెలంగాణ నిర్మిస్తోన్న అన్ని ప్రాజెక్టులపై ఏపీ కంప్లైంట్ చేసింది. పరస్పర ఫిర్యాదుల అంశాన్ని బోర్డులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా జూన్ 4, 5 తేదీల్లో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలు నిర్వహించారు. బోర్డు మీటింగుల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్తగా ఏపీ తలపెట్టిన వాటిపై చర్చించారు.
డీపీఆర్లు ఇవ్వలేదు
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాల్లో ప్రధానంగా డీపీఆర్లు సమర్పించాలనే అంశంపైనే ఎక్కువ చర్చ సాగినప్పటికీ రెండు రాష్ట్రాలు ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లు ఇవ్వలేదు. కేంద్ర మంత్రి ఆదేశాలతో జలశక్తి శాఖ సెక్రటరీ యూపీ సింగ్ రెండు సార్లు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీలైనంత త్వరగా డీపీఆర్లు తెప్పించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాలతో డీపీఆర్లు సబ్మిట్ చేయాలంటూ వారం రోజులు గడువుపెట్టి రెండు నదీ యాజమాన్య బోర్డులు ఇరు రాష్ట్రాలకు తిరిగి లేఖలు రాశాయి. ఇక రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరిలపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఇప్పటి వరకు వచ్చిన పర్యావరణ అనుమతులనూ కేంద్రానికి సమర్పించాలని సీడబ్ల్యూసీ కోరింది.
పక్కా సమాచారంతోనే అపెక్స్ కౌన్సిల్
పాలమూరు, డిండి లిఫ్ట్ స్కీంలపై నిర్వహించిన ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ తర్వాత రెండు రాష్ట్రాల జలవివాదాలపై మళ్లీ అపెక్స్ కౌన్సిల్ నిర్వహించలేదు. కేంద్ర జలశక్తి శాఖ ఈ యేడాది మొదట్లో నిర్వహించిన మీటింగ్కు తెలంగాణ ప్రభుత్వం నుంచి టెక్నికల్ మెంబర్సే హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీలకు చెక్ పెట్టాలని జలశక్తి శాఖ భావిస్తున్నా.. ఇరు వైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండటంతో ప్రాజెక్టులపై మొండిగానే ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. డీపీఆర్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర వివరాలన్నీ సేకరించి ఈ నెలాఖరు, లేదా ఆగస్టులో అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయానికి
వచ్చినట్టు తెలిసింది.
పర్యావరణ అనుమతులు కోరిన ప్రాజెక్టులు
తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు –రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీంలు, మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్(కృష్ణా), ఉమ్మడి ఏపీలో చేపట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత విస్తరిస్తోన్న కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీంలు, ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలు, దేవాదుల థర్డ్ ఫేజ్, తుపాకులగూడెం బ్యారేజీ, మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు (గోదావరి), రాజుపేట్, చనాకా – కొరాటా, పింపరాద్ – పర్సోడా బ్యారేజీలు, రామప్ప డైవర్షన్ స్కీంలకు ఎలాంటి అనుమతులు ఉన్నయో అవి సమర్పించాలని కోరింది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్ధాపురం, శివభాష్యం, వేదవతి, నాగులదిన్నె లిఫ్ట్ స్కీమ్లు, గుండ్రేవుల రిజర్వాయర్, మున్నేరు స్కీం, ఆర్డీఎస్ రైట్ కెనాల్, తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ – సుంకేకుల బ్యారేజీ మధ్యలో చేపట్టిన లిఫ్ట్ స్కీం, గోదావరి – పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్టు ఫేజ్–1, పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులకు ఉన్న ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్లను సబ్మిట్ చేయాలని ఆదేశించింది.
For More News..