న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం తీసుకొచ్చిన సబ్సిడీ స్కీమ్ పీఎం ఈ–డ్రైవ్ డెడ్లైన్ను ప్రభుత్వం పొడిగించింది. రూ.10,900 కోట్ల నిధులతో అమలవుతున్న ఈ పథకం కింద, ఈ ఏడాది జులై 31 వరకు రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్, అలాగే మార్చి 31, 2028 వరకు రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ (ఈ–-రిక్షాలు, ఈ–-కార్ట్స్) వాహనాలు ప్రోత్సాహకాలు పొందడానికి అర్హత పొందుతాయి.
ముందు ఈ డెడ్లైన్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు మార్చి 31, 2025 గా, ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మార్చి31,2027 గా ఉంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాల గరిష్ట ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ.1.5 లక్షలు, త్రీ వీలర్ వాహనాల ధర రూ.2.5 లక్షలు మించకూడదు. ఈ పథకం కోసం కేటాయించిన నిధులు పూర్తయితే, గడువు తీరకముందే పథకాన్ని మూసేస్తారు.
ఇప్పటికే ఎల్5 కేటగిరీ త్రీ వీలర్ వాహనాల కోసం కేటాయించిన ఫండ్స్ను వినియోగించడంతో, ఆ విభాగం డిసెంబర్ 26, 2025న క్లోజయ్యింది. కాగా, పీఎం ఈ–డ్రైవ్ కింద గరిష్టంగా 24,79,120 టూవీలర్ వాహనాలు, 39,034 త్రీవీలర్ వాహనాలు మాత్రమే సబ్సిడీ పొందుతాయి.
