- కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడి
- రామగుండం, సంగారెడ్డి, శంషాబాద్లో నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో మూడు ఈఎస్ఐ హాస్పిటళ్లు కట్టాలని నిర్ణయించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం రామగుండం, సంగారెడ్డి, శంషాబాద్లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఒక్కో చోట వంద బెడ్ల హాస్పిటళ్లను నిర్మిస్తామని తెలిపారు. రామచంద్రపురం, నాచారంలో హాస్పిటళ్లు సిద్ధమయ్యాయని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్రెడ్డి, రామేశ్వర్ తెలీ హాజరయ్యారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వంద మందికి పట్టాలు అందించారు. ముగ్గురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను ఆయన అభినందించారు. కరోనా సమయంలో కార్మికులకు, ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఇక్కడ కొత్తగా క్యాథ్ల్యాబ్, న్యూక్లియర్ మెడిసిన్ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. పారా మెడికల్ కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది సహా 6,400 పోస్టులను ఈఎస్ఐసీలో త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఎంబీబీఎస్ చదువుతూనే కరోనా రోగులకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ విశేష సేవలు అందించారని కిషన్రెడ్డి కొనియాడారు. దేశంలోని ఏ ఆస్పత్రికీ తీసిపోని విధంగా సనత్నగర్ దవాఖాన పని చేసిందన్నారు. ఆరోగ్య భారతం కోసం సాగుతున్న ప్రయత్నాలకు వైద్యులు తమ వంతు సహకారాన్ని అందించాలని రామేశ్వరి తెలీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ ముఖ్మీత్ ఎస్ భాటియా, కాలేజీ డీన్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ సౌలతులు అందాలి
ప్రభుత్వ పాలన అందరికీ చేరువకావాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సత్యకుమార్ రాసిన ‘సత్యకాలమ్’ వ్యాసాల సంకలనాన్ని భూపేంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు తమ పార్టీ లక్ష్యాలు ఉంటాయని చెప్పారు. తన పుస్తకం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తున్న సత్యకుమార్కు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అగ్నిపథ్ మంచి పథకమని బండి సంజయ్ అన్నారు. మేధావులు మౌనంగా ఉంటే దేశానికి అరిష్టమని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంగా పని చేయాలని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. కుల, మతాలకు అతీతంగా పార్టీలు పనిచేయాలని కోరారు.