అల్లోపతిని దాటి కొత్త మార్గాలు అన్వేషించాలి..ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసి రోగులకు న్యాయం చేయలేం

అల్లోపతిని దాటి కొత్త మార్గాలు అన్వేషించాలి..ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసి రోగులకు న్యాయం చేయలేం
  • ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మార్పు రావాలి 
  • ఐ ప్రిజమ్​ ఫౌండర్​, ​సీఈఓ డాక్టర్​ రవిశంకర్​ పొలిశెట్టి 
  • స్టంట్స్​ లేకుండా గుండెల్లో బ్లాక్స్​ తీసెయ్యవచ్చు
  • ప్రొఫెసర్​ డాక్టర్​ రఘుపతి 
  • ప్రిజమ్​ మెడిసిన్​పై ఒక్కరోజు సమావేశం

గచ్చిబౌలి, వెలుగు : ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో భారతదేశం చౌరస్తాలో ఉందని, ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఐ ప్రిజమ్​ ఫౌండర్, సీఈఓ డాక్టర్​ రవిశంకర్ ​పొలిశెట్టి అన్నారు. దేశంలో 4 కోట్ల మంది రోగులు చివరి దశలో ఉన్నందున సంప్రదాయ అల్లోపతిని దాటి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.

 ఆదివారం ఐటీ కారిడార్​లోని టీ హబ్​లో రెండు సంప్రదాయాలు ఒకే శాస్ర్తం పేరుతో ప్రిజమ్(పాలిసైంటిఫిక్ ​రీజెనరేటివ్ ​ఇంటిగ్రేటివ్ ​సిస్టమ్స్ ​మెడిసిన్) అంశంపై ఒక్కరోజు సమావేశం నిర్వహించారు. నేషనల్​ఇంటిగ్రేటెడ్ ​మెడికల్​అసొసియేషన్, ఐఐటీ హైదరాబాద్, అయూష్​ఇన్​స్టిట్యూషన్స్​ నిర్వహించిన ఈ సమావేశానికి ఆయుర్వేద, అల్లోపతి డాక్టర్లు, పలువురు వక్తలు హాజరయ్యారు. 

ఐ ప్రిజమ్ ​ఫౌండర్​డాక్టర్​ రవిశంకర్​ మాట్లాడుతూ సంప్రదాయ అల్లోపతి వైద్యాన్ని మించి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల రోగులకు న్యాయం చేయలేమని, కొత్త శాస్త్రాలను రీసెర్చ్ ​చేయడం వల్ల ఫలితాలు వస్తాయన్నారు. ఆధునిక వైద్య శాస్త్రాల వల్ల మనిషి జీవితకాలం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. 

అమెరికన్​హార్ట్ ​అసోసియేషన్ ​లెక్కల ప్రకారం గత 17 ఏండ్లలో 180 మిలియన్ల బైపాస్ ​సర్జరీలు జరిగాయని, తాను బైపాస్​సర్జరీలకు వెళ్లవద్దని సలహా ఇస్తానని, తాను ప్రతిపాదించే బ్లాక్ ​రివర్సల్​టెక్నాలజీని అనుసరించాలన్నారు. వాత, పిత్తం, కఫం ప్రమాణాలు, నాడీ పరీక్ష, సంప్రదాయ ఔషధాలు వంటి ఆయుర్వేద వైద్యం, భారతీయ అనుబంధ వైద్య వ్యవస్థ మెరుగుపడాలన్నారు.

 అందుకోసమే పాలీసైంటిఫిక్ రీజెనరేటీవ్ ఇంటిగ్రేటీవ్ సిస్టమ్ ​మెడిసిన్​ తీసుకొచ్చామన్నారు. ఐ ప్రిజమ్​ఆధ్వర్యంలో మూడేండ్ల  మెడిసిన్ ​కోర్సు డిసెంబర్ ​నుంచి ప్రారంభిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్​ రవిశంకర్​ తెలిపారు. ఇందులో మొదటి విడతగా 8 నెలల పాటు తరగతులు నిర్వహిస్తామని, ప్రస్తుతం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంబీబీఎస్, బీఎస్సీ లైఫ్ ​సైన్సెస్, బీఏఎంఎస్​, బీహెచ్​ఎంఎస్​, బీటెక్​ఈసీఈ కోర్సులు చేసిన వారు ఇందులో జాయిన్ ​కావొచ్చన్నారు.

 ఐఐటీ హైదరాబాద్ ​బయోటెక్నాలజీ డీన్​ డాక్టర్​ నరహరశాస్త్రి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యాన్ని డాక్టర్లు ప్రోత్సహించాలన్నారు. ఆయుర్వేదిక్​ కాలేజీ ప్రొఫెసర్​ డాక్టర్​ రఘుపతి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రకాల జబ్బులను నయం చేయవచ్చని, స్టంట్స్​ లేకుండా గుండెల్లో బ్లాక్స్ ​తీసెయ్యవచ్చన్నారు. ఎన్​ఐఎంఏ ప్రెసిడెంట్​డాక్టర్​ అనిల్​కుమార్​పాటిల్​, వక్తలు వి. ప్రకాశ్​, వివి.రావు తదితరులు పాల్గొన్నారు.