
ముంబై: మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సవాళ్లతో సావాసం చేస్తున్నాయి. అన్ని కంపెనీల మైక్రో ఫైనాన్స్ మూలధనం మార్చి క్వార్టర్ చివరి నాటికి ఏడాది ప్రాతిపదికన 14 శాతం తగ్గి 3.81 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని సోమవారం ఒక రిపోర్ట్ తెలిపింది. ఆస్తుల నాణ్యత సవాలుగా మారింది. నెల రోజుల లోన్ల చెల్లింపులు కొంత పెరిగినా, మొత్తం మీద పరిస్థితి ఆశావహంగా ఏమీ లేదని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ రిపోర్ట్ తెలిపింది.
దీని ప్రకారం.. గత సంవత్సరం మైక్రో ఫైనాన్స్ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ కంపెనీలు అట్టడుగు స్థాయి ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తాయి. వీటి మొండిబకాయిలు పెరుగుతున్నాయి. కస్టమర్లు ఎక్కువ లోన్లు తీసుకోవడం, సామర్థ్యానికి మించి అప్పులు చేయడం దీనికి ప్రధాన కారణాలు. దీంతో కంపెనీలు ఒక కస్టమర్కు ఎక్కువ అప్పులు ఇవ్వడం తగ్గించాయి. మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
దీంతో కంపెనీల సంఖ్య తగ్గింది. లోన్ల సంఖ్యా తగ్గింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి యాక్టివ్ లోన్ల సంఖ్య 14 కోట్లకు తగ్గింది. గత డిసెంబర్లో 14.6 కోట్ల లోన్లు ఉండేవి. ఏడాది క్రితం 16.1 కోట్ల మంది లోన్లు తీసుకున్నారు. మైక్రో ఫైనాన్స్ పరిశ్రమ జనవరి నుంచి మార్చి మధ్య 1.33 కోట్ల లోన్లను ఇచ్చింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 2.40 కోట్ల లోన్లు మంజూరు అయ్యాయి.
గత అక్టోబర్–-డిసెంబర్ కాలంలో లోన్ల సంఖ్య 1.2 కోట్లుగా ఎక్కువగా ఉంది. నెల రోజుల లోన్ల బకాయిల చెల్లింపు సమయం డిసెంబరుతో పోలిస్తే మార్చిలో మెరుగుపడింది. ఇతర విభాగాలలో మాత్రం లోన్ల బకాయిల వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. దీంతో కంపెనీలు లోన్లు ఇవ్వడానికి కఠిన నిబంధనలను విధిస్తూనే లోన్ల మొత్తాలను పెంచుతున్నాయి. లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువైన లోన్లు ఏడాది ప్రాతిపదికన 38.5 శాతం పెరిగాయి. రూ.30 వేలలోపు లోన్లు 36 శాతం తగ్గాయి.