జీవో 84 రద్దు చేసేలా ఆదేశాలివ్వండి.. భాగ్యనగర్‌‌ సిటిజన్స్‌‌ అసోసియేషన్‌‌ పిల్

జీవో 84 రద్దు చేసేలా ఆదేశాలివ్వండి.. భాగ్యనగర్‌‌  సిటిజన్స్‌‌ అసోసియేషన్‌‌ పిల్
  • ఆ జీవోను సవాలుచేస్తూ భాగ్యనగర్  సిటిజన్స్ అసోసియేషన్  పిల్
  • కౌంటర్  వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • విచారణ వచ్చే నెల 14కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : నోటరీతో కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్‌‌  చేస్తామని పేర్కొంటూ గత నెల 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. జీవో 28 చట్టవ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ భాగ్యనగర్‌‌  సిటిజన్స్‌‌ అసోసియేషన్‌‌  అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌‌  పిల్  వేశారు. ఆయన తరపున అడ్వొకేట్‌‌  డి.నరేంద్ర నాయక్‌‌ వాదించారు. 125 చదరపు గజాలు, అంతకన్నా తక్కువ ఉన్న స్థలం కొన్న వాటిలో కట్టిన ఇండ్లను రెగ్యులరైజ్‌‌ చేయడం అన్యాయమన్నారు. 

125 గజాల వరకు ఎలాంటి స్టాంపు డ్యూటీ, జరిమానా ఉండదన్నారు. 125 గజాల నుంచి 3 వేల గజాల వరకు స్థలం ఉంటే ఇప్పటి మార్కెట్‌‌  విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ వసూలుకు అనుమతించడం అన్యాయమన్నారు. దీనివల్ల సివిల్‌‌  వివాదాలు పెరిగిపోతాయన్నారు. వెంటనే జీవో 84ను రద్దు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని నరేంద్ర నాయక్  కోరారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌‌  వేస్తామని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌‌  చెప్పారు. దీంతో విచారణను హైకోర్టు వచ్చే నెల 14కి వాయిదా వేసింది. 

ఈలోగా కౌంటర్  వేయాలని ప్రతివాదులైన చీఫ్‌‌  సెక్రటరీ, రెవెన్యూ, మునిసిపల్‌‌  అధికారులను ఆదేశించింది. అలాగే జీవో 84ను సవాల్‌‌  చేస్తూ పిల్‌‌ దాఖలు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. పిల్‌‌కు నంబర్‌‌ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. నంబర్‌‌  కేటాయించాలని, పిల్‌‌పై వచ్చే నెల 14న విచారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌  అలోక్‌‌  అరధే, జస్టిస్‌‌  వినోద్‌‌  కుమార్‌‌ల డివిజన్‌‌  బెంచ్‌‌  బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.