- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం జరిగిన మున్సిపల్, మేయర్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా మరోసారి బయటపడిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉందని ఆరోపించారు. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహాస్య ఒప్పందాలను జనంలోకి తీసుకెళ్తామన్నారు. కాళేశ్వరం అవినీతికి బీజేపీ మద్దతుగా నిలిచిందని ఈ ఎన్నిక ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.
అందుకే కేసీఆర్.. బీజేపీకి బహుమానంగా కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటింగ్ కు దూరంగా ఉంచారని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ అండగా నిలిచిందంటే కేసీఆర్ అవినీతికి బీజేపీ అండగా నిలిచినట్లేనన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతలకు ఏమాత్రం బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సీఎం రేవంత్ రెడ్డికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు.
