
చంద్రుడి ఉపరితలంపై బుధవారం ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్ కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ ప్రదాన్ నుంచి స్పెషల్ మెసేజ్ అందిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ ప్రదాన్, ల్యాండర్ విక్రమ్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడిందని ట్వీట్ చేసింది. విక్రమ్ కు ప్రదాన్ వెల్కం మెసేజ్ పంపిందని తెలిపింది.
జాబిల్లి చుట్టూ ఆర్బిటర్ ప్రదాన్ వంద కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్నది. ఇక విక్రమ్ ల్యాండర్ తాజాగా జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని ఆవలి వైపు నుంచి కూడా ఫొటోలు తీసి పంపిందని ఇస్రో తెలిపింది. ఈ ఫొటోలను ట్విటర్ లో షేర్ చేసింది. ‘‘విక్రమ్ ఫొటోలు తీసిన ప్రాంతాలను హేన్, బాస్ ఎల్, మేర్ హంబోల్డ్ టియానం, బెల్కోవిచ్ గా గుర్తించాం. ల్యాండర్ ఈ నెల 19న ఈ ఫొటోలు తీసింది.
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ సేఫ్ గా ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయి. బండరాళ్లు, లోతైన గుంతలు, లోయలు లేని ప్రదేశం కోసం విక్రమ్ అన్వేషిస్తున్నది” అని ఇస్రో పేర్కొంది.