ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ 3 విజయం.. శ్రీహరికోట ఇస్రో సక్సెస్.. ఇంకా చెప్పాలంటే ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ. ఈ విజయానికి కారణం వెనుక తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతం కీలక పాత్ర పోషించింది. చంద్రుడిపై ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ఇస్రో.. తమిళనాడులోని నమక్కల్ గ్రామం నుంచి మట్టిని తెప్పించింది.మట్టికి.. చంద్రయాన్ 3 విజయానికి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. . .
అంతరిక్షంలో ప్రయోగం పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్లో ఉండదు. ఉపగ్రహాలు, నింగిలోకి పంపేటప్పడు ఉపయోగించే వాటి పనితీరును భూమిపైనే పరిశీలిస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తారు. చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్, రోవర్ మాడ్యూల్లకు భూమిపైనే ఇస్రో శాస్త్రవేత్తలు పరీక్షలు చేశారు. విక్రమ్ ప్రగ్యాన్ రోవర్.. చంద్రుడి ఉపరితలంపై సేఫ్ గా ల్యాండ్ అయ్యేందుకు అక్కడి మట్టిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళనాడు నుంచి మట్టిని తీసుకొచ్చారు ఇస్రో శాస్త్రవేత్తలు.
చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలోని నమక్కల్ అనే ఊరు ఉందన్న విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. కాని ఇస్రోకు మాత్రం ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో నమక్కల్ ఊరి మట్టి ఎంతో కృషి చేసింది. చంద్రయాన్ 3 ప్రయోగం కోసం కూడా నమక్కల్ నుంచి మట్టిని సేకరించారు.
విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లిపై దిగడాని ముందు అనువైన ప్రదేశం కావాలి. దీనికోసం అక్కడున్న వాతావరణానికి సరిపోయేలా సాంకేతికతను ఉపయోగించాలి. చంద్రయాన్ 3 ల్యాండ్ అయి.. పరిశోధనలు చేసేందుకు భూమిపైనా రోవర్కు అక్కడ ఉండే మట్టిని ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని నమక్కల్ మట్టిని గుర్తించారు. 2012 లో తొలిసారి నమక్కల్ నుంచి 50 టన్నుల మట్టిని ఇస్రో సేకరించింది. అది చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లక్షణాలనే పోలి ఉన్నట్లు ఇస్రో ధ్రువీకరించిందని పెరియార్ యూనివర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్ ఎస్. అన్బళగన్ తెలిపారు.
ఈ క్రమంలోనే 2019 లో ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగంలో నమక్కల్ మట్టిని తీసుకువచ్చి.. ల్యాండర్, రోవర్ లను అక్కడ తిరిగేలా చేశారు. ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్ 3 లోనూ నమక్కల్ మట్టినే ఉపయోగించారు. తాము చేపట్టిన పరిశోధనల్లో భాగంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మట్టి.. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లాగే ఉందని అన్బళగన్ వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ ధ్రువంపై ఉన్న మట్టి మాదిరిగానే ఇది ఉంటుందని చెప్పారు. జాబిల్లి ఉపరితలంపై అనోర్థోసైట్ రకం మట్టి ఉందని.. నమక్కల్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంది. కున్నమళై ప్రాంతాల్లో ఈ రకం మట్టి చాలా దొరుకుతుందని తెలిపారు. ఇస్రో చేపట్టే భవిష్యత్ ప్రయోగాలకు కూడా ఇక్కడి నుంచి మట్టి పంపిస్తామని అన్బగళన్ చెప్పారు.