చందమామ వైపు శరవేగంగా చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23న ల్యాండింగ్

చందమామ వైపు శరవేగంగా చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23న ల్యాండింగ్

ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. ఇటీవలే చంద్రయాన్ 3 భూ కక్ష్యను దాటి చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించిందని  ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో చేరడానికి ప్రయాణం ప్రారంభించిందని.. చంద్రయాన్3 తదుపరి మజిలీ చంద్రుడేనంటూ ఇస్రో ఒక ట్వీట్ చేసింది. ఆగస్ట్ 5న  చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 వెళ్తుందని వెల్లడించింది. ట్రాన్స్ ల్యూనార్ ఆర్బిట్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లడం చంద్రయాన్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి. 

చంద్రుడి కక్ష్యలోకి చేరిన తరువాత క్రమంగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరు అవుతుంది. ఆ తరువాత క్రమంగా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుంది. అనంతరం ల్యాండర్ నుంచి ర్యాంప్ మీదుగా ఆరు చక్రాల రోవర చంద్రుడి ఉపరితలంపైకి వెళ్తుంది. అక్కడ 14 రోజుల పాటు (ఒక ల్యూనార్ డే) కలియతిరుగుతూ భూమి పైకి హై రెసొల్యూషన్ ఫొటోలను పంపుతుంది. చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై ఆగస్ట్ 23న దిగుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చంద్రుడిపై అడుగిడి చంద్రయాన్ చరిత్ర సృష్టిస్తుంది.