చంద్రయాన్ 2 మిషన్లో భాగంగా 14 పేలోళ్లను చంద్రుడిపైకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కసరత్తు చేస్తోంది. జూలై 9 – జూలై 16 మధ్య చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేస్తామంటూ ఇటీవల ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ల్యాండర్, రోవర్, ఆర్బిటర్లను చంద్రుడిపైన దించనుంది. స్పేస్క్రాఫ్ట్ చంద్రుడిపై దిగాక సైంటిఫిక్ టెస్టులు చేసేందుకు, చంద్రుడి ఫొటోలను తీసేందుకు ఈ పేలోళ్లు లేదా ప్రయోగ మాడ్యూళ్లను ఇస్రో పంపుతోంది. ఆర్బిటర్లో 8, ల్యాండర్ విక్రమ్లో 4, రోవర్ ప్రజ్ఞాన్లో 2 పేలోళ్లను పంపే ఏర్పాట్లు చేస్తోంది. 2008లో చేసిన చంద్రయాన్కు భిన్నంగా ఈ ప్రయోగం సాగబోతోంది. అప్పుడు ఐదు విదేశీ పేలోళ్లను తీసుకెళ్లగా, ఇప్పుడు విదేశీ పేలోళ్లు లేకుండానే ప్రయోగం జరపబోతోంది. సెప్టెంబర్ 6 నాటికి స్పేస్క్రాఫ్ట్ చంద్రుడిపై దిగుతుందన్న విషయం తెలిసిందే.
ఈ ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్3 లాంచ్ వెహికల్తో చేయబోతున్నారు. ఆర్బిటర్, ల్యాండర్ మాడ్యూళ్లను (ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్) కలిపి రాకెట్లోకి ఎక్కిస్తారు. రోవర్ను ల్యాండర్లో పెట్టి పంపిస్తారు. ప్రయోగం తర్వాత 45 నుంచి 50 రోజులకు ఆర్బిటర్ ప్రొపల్షన్ మాడ్యూల్ సాయంతో చంద్రుడి కక్ష్యలోకి ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ప్రవేశిస్తుంది. వెంటనే విక్రమ్ ఆర్బిటర్ నుంచి నుంచి విడిపోయి చంద్రుడి దక్షిణ ధ్రువంపై నెమ్మదిగా దిగుతుంది. నిజానికి ఈ ప్రయోగాన్ని గత ఏడాది ఏప్రిల్లోనే నిర్వహించాల్సి ఉన్నా ప్రయోగంలోని సంక్లిష్టతల వల్ల ఇస్రో వాయిదా వేస్తూ వస్తోంది.