
కర్నూలు: పోలీసులు వెంటపడితే.. తప్పించుకునేందుకు పొలాల్లోకి దూసుకెళ్లిన ఓ గ్రానైట్ లారీ బురదలో ముందుకెళ్లలేక కూరుకుపోయింది. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీలను పట్టుకునేందుకు విజిలెన్స్ వారు ఆదివారం తెల్లవారుఝామున తనిఖీలు చేస్తున్నప్పుడు జరిగిందీ సంఘటన. చేజింగ్ చేసి నాలుగు లారీలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు.. బురదలో చిక్కుకున్న ఐదో లారీని పోలీసులు, గ్రామస్తుల సహాయంతో తంటాలుపడి బయటకు తీసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఏపీలోని కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారం గ్రామం దగ్గర జరిగిందీ సంఘటన.
విశ్వసనీయ సమాచారం మేరకు గనులు భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ ఏడీ బాల సుబ్రహ్మణ్యం, రాయల్టీ ఇన్స్ పెక్టర్ నాగరాజు, నవీన్, గంగాధర్, బాలు నాయక్ తదితరులు ఆదోని పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీల నుండి అక్రమంగా గ్రానైట్ తవ్వుకుని తరలిస్తున్నారన్న సమాచారం నిజమేనని తేలింది. లారీలు ఆపకుండా స్పీడ్ గా తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేశాయి. విజిలెన్స్ వారు ఛేజింగ్ చేస్తూ.. నాలుగు లారీలను నాలుగు ప్రాంతాల్లో పట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఒక లారీని.. పత్తికొండ, జొన్నగిరి గ్రామాల వద్ద మరో మూడు లారీలను పట్టుకుని ఆయా పోలీసు స్టేషన్ల కు అప్పగించారు. అయితే ఐదో లారీ మాత్రం ఆచూకీ లేకుండా పోయింది. తెల్లారిన తర్వాత వెతికి చూడగా అగ్రహారం గ్రామ శివార్లలో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారు. గ్రానైట్ లోడుతో ఉన్న లారీని డ్రైవర్ వదిలేసి పరారైపోయాడు. బురదలో చిక్కుకున్న ఈ లారీని గ్రామస్తుల సహాయంతో బయటకు తీశారు. అక్రమంగా తవ్వితీసిన ఈ గ్రానైట్ ను తాడిపత్రికి తరలిస్తున్నట్లు గుర్తించారు.