రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ లీడ్ రోల్స్లో అధ్వైత్ నాయర్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’. షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మాతలు. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 13న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ప్రెస్మీట్ నిర్వహించారు. హీరో రోషన్ మాథ్యూ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మేమంతా నాలుగు నెలలపాటు రెజ్లింగ్ నేర్చుకున్నాం.
సినిమాకు ఎంతో కీలకమైన స్పెషల్ కేమియో క్యారెక్టర్ను మమ్ముట్టి గారు పోషించారు. ఆయన పాత్ర మా సినిమాకు టర్నింగ్ పాయింట్. మలయాళంలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తెలుగు వాళ్లకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పాడు. ‘ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని విశాఖ్ నాయర్ అన్నాడు. చక్కని సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే సినిమా అని ఇషాన్ చెప్పాడు. మలయాళంలో మెప్పించిన ఈ చిత్రం తెలుగులోనూ మెప్పిస్తుందనే నమ్మకముందని సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ వెల్లడించారు.
