
తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్దజీయంగార్లు చాతుర్మాస దీక్షను ఆదివారం(జూలై13) ప్రారంభించారు. ఆనవాయితీ ప్రకారం.. ఈ దీక్ష ప్రారంభానికి ముందు శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. ఆ తరువాత మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దీక్షా సంకల్పాన్ని చేపట్టారు.
శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీరామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని ప్రాశస్త్యం ఉంది. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి ఆచనలో ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత సేకరించిన పుట్ట మన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయ్యంగారి మఠం దగ్గరనుంచి శ్రీ చిన్నజీయంగారు , ఇతర శిష్యబృందంతో తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహద్వారం చెంత టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం శ్రీపెద్దజీయర్ మఠంలో శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి కలిసి ఈవో, అదనపు ఈవోలను శాలువతో సన్మానించారు.