
వేములవాడ, వెలుగు: బ్రాండెడ్ మందు సీసాల్లో చీప్ లిక్కర్ పోసి నకిలీ మందు తయారు చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తునికి కార్తీక్ బ్రాండెడ్ మందు సీసాల్లో చీప్ లిక్కర్ నింపి అమ్మేవాడు. తక్కువ ధరకు బ్రాండెడ్ మందు వస్తుందంటూ సోషల్ మీడియాలో, తెలిసిన ఫ్రెండ్స్ గ్రూపుల్లో ప్రచారం చేసేవాడు.
దీంతోపాటు ఈ మందును అమ్మేందుకు వేములవాడ పట్టణానికి చెందిన తామరపల్లి సంతోష్ సహకరించేవాడు. ఎక్సైజ్ పోలీసులకు దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో బుధవారం రుద్రవరంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో కార్తీక్ ఇంటి సమీపంలో ఇసుకలో 12 బ్రాండెడ్ బాటిళ్లలో నిల్వచేసిన చీప్ లిక్కర్ మందును గుర్తించారు. సంతోష్ వద్ద కూడా సుమారు 12కిపైగా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆరు నెలలుగా వీరు ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు రవి, ప్రమీత్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కార్తీక్కు ఈ నెల 13న పెళ్లి ఉండగా.. దావత్ ఇచ్చేందుకు ఇదే మందును సిద్ధం చేసినట్లు సమాచారం.