బషీర్బాగ్, వెలుగు: విలాసవంతమైన క్రూజ్ షిష్లో షికారు చేయాలనుకున్న ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. కొచ్చి, లక్షద్వీప్, ముంబై నగరాల మీదుగా సాగే క్రూజ్ ప్రయాణం కోసం ఆన్లైన్లో వెతికిన బాధితుడు.. చివరకు రూ.2,42,488 పోగొట్టుకున్నారు. కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్ 26న గూగుల్లో బ్రౌజ్ చేస్తుండగా కోచి, లక్షద్వీప్, ముంబై మార్గాల్లో క్రూయిజ్ ప్రయాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న వెబ్సైట్ను చూసి నమ్మాడు.
నలుగురు సభ్యుల కోసం క్రూయిజ్ టూర్ బుక్ చేసుకుని మొదట రూ.23,680 అడ్వాన్స్ చెల్లించాడు. అనంతరం లక్షద్వీప్ పర్మిట్ పత్రాలు ఇస్తామని స్కామర్లు నమ్మించి ఇద్దరు పిల్లల చార్జీల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేశారు. ఆ తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెక్అవుట్ సమయంలో మొత్తం తిరిగి ఇస్తామని నమ్మబలికి మరింత డబ్బు తీసుకున్నారు. తదుపరి దశలో చెల్లింపులు విఫలమయ్యాయని నమ్మబలికిన స్కామర్లు.. సరైన కారణం చెప్పకుండా బుకింగ్ను రద్దు చేశారు.
అనంతరం మొత్తం డబ్బు రిఫండ్ చేస్తామని చెప్పి, రద్దు చార్జీల పేరుతో మరో రూ.48,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడు మొత్తం రూ.2,42,488 నష్టపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
