గచ్చిబౌలి, వెలుగు: డెలివరీ బాయ్కత్తితో దాడి చేయగా గాయపడ్డ ఓ చెఫ్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్కు చెందిన వ్యాపారి భాస్కర్కు నానక్ రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్ మెంట్లో విల్లా ఉంది. బిజినెస్ పని మీద సిటీకి వచ్చిప్పుడు భాస్కర్ ఇక్కడే ఉండేవాడు. ఈ విల్లాలో వంట చేసేందుకు కడప జిల్లాకు చెందిన శివప్రసాద్(29)ను చెఫ్గా నియమించుకున్నాడు. శివప్రసాద్ శేరిలింగంపల్లి పరిధి నేతాజీనగర్లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు భాస్కర్ బంధువు సాయిశ్రీ కాకినాడ నుంచి స్విగ్గీలో బంజారాహిల్స్లోని ఓ స్వీట్ హౌస్ నుంచి గోల్ఫ్ ఎడ్జ్ విల్లా అడ్రెస్కు ఆర్డర్ పెట్టింది. ఆసిఫ్నగర్కు చెందిన డెలివరీ బాయ్ అమీర్(20) ఆర్డర్ తీసుకుని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్ మెంట్ దగ్గరికి వెళ్లాడు. విల్లా అడ్రెస్ తెలియకపోవడంతో 2 గంటలు ఆలస్యమైంది. డెలివరీ లేట్ కావడంతో సాయిశ్రీ, అమీర్ ఫోన్లో గొడవపడ్డారు. తర్వాత భాస్కర్ దగ్గర పనిచేసే విక్కీ అనే వ్యక్తి అమీర్కు కాల్ చేసి విల్లా అడ్రెస్ సరిగ్గా చెప్పడంతో అతడు అక్కడికి వెళ్లి ఇంట్లో ఉన్న చెఫ్ శివప్రసాద్కు స్వీట్ బాక్సు డెలివరీ చేశాడు.
సాయిశ్రీతో అమీర్ గొడవపడ్డాడని..తాను వచ్చే వరకు అతడిని అక్కడే ఉంచాలని శివప్రసాద్కు విక్కీ కాల్ చేసి చెప్పాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లొద్దంటూ అమీర్ను శివ ప్రసాద్ అడ్డుకున్నాడు. తనకు వేరే ఆర్డర్స్ ఉన్నాయని, డబ్బులు ఇస్తే వెళ్తానని అమీర్ అతడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తితో శివప్రసాద్పై అమీర్ దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శివప్రసాద్ను స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నిమ్స్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి అతడు చనిపోయాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అమీర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.