డెలివరీ బాయ్ దాడిలో గాయపడ్డ చెఫ్ ​మృతి

డెలివరీ బాయ్ దాడిలో గాయపడ్డ చెఫ్ ​మృతి

గచ్చిబౌలి, వెలుగు: డెలివరీ బాయ్​కత్తితో దాడి చేయగా గాయపడ్డ ఓ చెఫ్ హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  వైజాగ్​కు చెందిన వ్యాపారి భాస్కర్​కు నానక్ రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్ మెంట్​లో విల్లా ఉంది. బిజినెస్ పని మీద సిటీకి వచ్చిప్పుడు భాస్కర్ ఇక్కడే ఉండేవాడు. ఈ విల్లాలో వంట చేసేందుకు కడప జిల్లాకు చెందిన శివప్రసాద్(29)ను చెఫ్​గా నియమించుకున్నాడు. శివప్రసాద్​ శేరిలింగంపల్లి పరిధి నేతాజీనగర్​లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు భాస్కర్ బంధువు సాయిశ్రీ కాకినాడ నుంచి స్విగ్గీలో బంజారాహిల్స్​లోని ఓ స్వీట్ హౌస్ నుంచి గోల్ఫ్​ ఎడ్జ్​ విల్లా అడ్రెస్​కు ఆర్డర్ పెట్టింది. ఆసిఫ్​నగర్​కు చెందిన డెలివరీ బాయ్​ అమీర్​(20) ఆర్డర్ తీసుకుని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్ మెంట్ దగ్గరికి వెళ్లాడు. విల్లా అడ్రెస్ తెలియకపోవడంతో 2 గంటలు ఆలస్యమైంది. డెలివరీ లేట్ కావడంతో సాయిశ్రీ, అమీర్ ఫోన్​లో గొడవపడ్డారు. తర్వాత భాస్కర్ దగ్గర పనిచేసే విక్కీ అనే వ్యక్తి అమీర్​కు కాల్ చేసి విల్లా అడ్రెస్ సరిగ్గా చెప్పడంతో అతడు అక్కడికి వెళ్లి ఇంట్లో ఉన్న చెఫ్ శివప్రసాద్​కు స్వీట్ బాక్సు డెలివరీ  చేశాడు.

సాయిశ్రీతో అమీర్ గొడవపడ్డాడని..తాను వచ్చే వరకు అతడిని అక్కడే ఉంచాలని శివప్రసాద్​కు విక్కీ కాల్ చేసి చెప్పాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లొద్దంటూ అమీర్​ను  శివ ప్రసాద్ అడ్డుకున్నాడు. తనకు వేరే ఆర్డర్స్ ఉన్నాయని, డబ్బులు ఇస్తే వెళ్తానని అమీర్ అతడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తితో శివప్రసాద్​పై అమీర్ దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శివప్రసాద్​ను స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నిమ్స్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి అతడు చనిపోయాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అమీర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.