ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసక్తిర పోరు జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగనున్న ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. లీగ్లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు ఆడగా, పంజాబ్ ఓ గెలుపు (ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో విజయం), మరో మ్యాచ్లో పరాజయం (కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి) మూటగట్టుకోగా.. సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ (కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి, లక్నో చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం) ఓటమిపాలై బోణీ విజయం కోసం తహతహలాడుతుంది.
గత రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 25 సార్లు తలపడగా, చెన్నై15, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేశాయి. ఈ ఇరు జట్లు చివరిగా తలపడిన 5 సందర్భాల్లో చెన్నై 4 మ్యాచ్ల్లో గెలవగా, పంజాబ్ ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. గతేడాది ఐపీఎల్ విషయానికొస్తే.. చెన్నై, పంజాబ్ జట్లు చెరో మ్యాచ్లో గెలుపొందాయి. ఓవరాల్గా చూస్తే.. క్యాష్ రిచ్ లీగ్లో పంజాబ్పై చెన్నైదే పైచేయిగా తెలుస్తోంది. ఇక తుది జట్లలో మార్పులు చేర్పుల విషయాన్ని పరిశీలిస్తే.. ఇరు జట్లు గత మ్యాచ్లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.