- మూడు నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం చూపండి
- మంత్రి ఉత్తమ్కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వినతి
- బ్యారేజీ బ్యాక్వాటర్తో లక్ష ఎకరాలు మునుగుతున్నయ్
- మంచిర్యాల టౌన్ కూ వరద ముప్పు ఉంది
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం నష్టాన్నీ అంచనా వేయలేదు
- రైతులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత విఫల డిజైన్ మేడిగడ్డ బ్యారేజీ అని, దాని బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆ బ్యారేజీ బ్యాక్ వాటర్తో మంచిర్యాల పట్టణంలోని చాలా ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతున్నదని తెలిపారు. ఆదివారం ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్వాటర్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్వాటర్తో సమస్య లేకుండా ఓ కరకట్టను నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని వివేక్ వెంకటస్వామి కోరారు. తద్వారా మూడు నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఆ ప్రాజెక్టు తప్పుడు డిజైన్పై గత నాలుగేండ్ల నుంచి పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీతో కలిగిన నష్టంపై ఆ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అంచనాలు వేయలేదని, రైతులకు నష్టపరిహారమూ అందించలేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. బ్యారేజీలోని టెక్నికల్ బ్లండర్నూ సరిదిద్దలేదని, ఇవన్నీ కేసీఆర్ వైఫల్యాలేనని పేర్కొన్నారు.
అదో ఫెయిల్యూర్ ప్రాజెక్ట్
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఓ విఫల ప్రాజెక్టని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీని కట్టడం వల్ల నీటిని ఎత్తిపోయట్లేదని పేర్కొన్నారు. ఒరిజినల్ తుమ్మడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారానే నీళ్లు వస్తున్నప్పుడు.. మేడిగడ్డ నుంచి నీళ్లను వృథాగా కిందికి వదిలేయాల్సి వస్తున్నదని అన్నారు. మరోవైపు కాళేశ్వరంలో నీళ్లను పంప్ చేయడానికి కరెంట్ ఖర్చులూ ప్రభుత్వంపై భారీగా పడుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో వరదలు వచ్చి ప్రాజెక్టులోని పంపులు, మోటార్లు మునిగిపోయాయని, ఇప్పుడేమో బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని పేర్కొన్నారు.