హైదరాబాద్: తెలంగాణలో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ రికార్డు స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ చికెన్ మార్కెట్లలో స్కిన్ లెస్ చికెన్ ధర కిలో 310 నుంచి 320 రూపాయల వరకూ అమ్ముతున్నారు. ఈ చలి కాలంలో ఇదే ఎక్కువ రేటు అని వ్యాపారులు చెప్పుకొచ్చారు. మటన్ ధర కూడా కిలో 8 వందల రూపాయల నుంచి 9 వందల వరకూ అమ్ముతున్నారు. కోడి గుడ్ల రేట్లయితే కొండెక్కి కూర్చున్నాయ. ఒక్కో గుడ్డును 8 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో చికెన్ ధరలు 2025, డిసెంబర్ మొదటి వారంలో కొంత తగ్గినప్పటికీ.. చివరి వారం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు పీక్కు చేరింది.
కొద్ది రోజుల కిందటి వరకు రూ.240 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.280 నుంచి రూ.320 వరకు పలుకుతోంది. లైవ్ కోడి రేటు రూ.170 వరకు ఉంది. సంక్రాంతి పండుగ, ఆ తర్వాత మేడారం జాతర ఉండటంతో చికెన్కు డిమాండ్ ఉంటుందని, దీంతో రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని, లేదంటే ఇదే రేటు స్థిరంగా ఉండొచ్చని చికెన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు చికెన్తో పాటు గుడ్డు ధర కూడా రిటైల్ మార్కెట్లో రూ.7 నుంచి రూ.8 పలుకుతోంది.
చలి కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బాయిలర్, లేయర్ కోడి పిల్లల మరణాలు పెరగడం పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వీటి మరణాలను తగ్గించడానికి పౌల్ట్రీ రైతులు షెడ్ల చుట్టూ పరదాలు కట్టి వెచ్చదనం కల్పించేందుకు హీటర్లు, వేడిని ఇచ్చే అత్యధిక ఓల్టేజీ గల లైట్లను వినియోగిస్తున్నారు. ఇదంతా వారికి అదనపు భారంగా మారుతోంది. కోళ్లతో పాటు కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లోకి సప్లై తగ్గిపోయింది.
దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగిపోయినట్లు చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వారం, పదిరోజులుగా గుడ్డు హోల్సేల్ ధర రూ.7 ఉండగా, రిటైల్లో మాత్రం రూ.8కి అమ్ముతున్నారు. రాష్ట్రంలో వచ్చే సంక్రాంతి పండుగతో పాటు మేడారం జాతర, ఇతర జాతరలు ఉండడంతో చికెన్ డిమాండ్ పీక్కు చేరే అవకాశం ఉంది.
