వెరీ షాకింగ్ : రోడ్లపై మటన్, చేపలు, కోడిగుడ్ల అమ్మకాలు నిషేధం

వెరీ షాకింగ్ : రోడ్లపై మటన్, చేపలు, కోడిగుడ్ల అమ్మకాలు నిషేధం

మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారో లేదో.. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, చేపల విక్రయాల నిషేధంపై డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ వరకు ప్రచారం ప్రారంభిస్తామన్నారు. 

ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు. డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 

తరచూ నేరాలకు పాల్పడేవారిపై  కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడుతున్నామన్నారు. ధ్వని పరికరాలను నియంత్రించనున్నామని, ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించారు. లౌడ్ స్పీకర్ల వలన తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దని చెప్పింది. ప్రతి జిల్లాలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని మోహన్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయించింది. 

జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగే నూతన రామాలయ ‍ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.

బుధవారం (డిసెంబర్ 13న) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.  రాజేంద్ర శుక్లా, జగదీశ్‌ దేవ్‌రా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ,  కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాథ్‌, పుష్కర్‌ సింగ్‌ ధామి, ఏక్‌నాథ్‌ శిండే, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌ హాజరయ్యారు. 

230 స్థానాలు ఉన్న  మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.  ఈ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్‌ 66 స్థానాలకు పరిమితమైంది. మోహన్ యాదవ్ ప్రస్తుతం  ఉజ్జయిని సౌత్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.