
ఒకప్పుడు పెద్దవాళ్ల దగ్గర మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉండేది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని చిన్నపిల్లల చేతుల్లో ఫోన్ వచ్చి చేరింది. దాంట్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి యాప్స్ మామూలయ్యాయి. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. సోషల్ మీడియాలో రోజూ వచ్చే కొత్త ఛాలెంజ్తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ అంటూ పిల్లలు తెలిసీ తెలియక ఫొటోలు పెట్టి సైబర్ బుల్లీయింగ్ బారినపడుతున్నారు. అందుకే, పిల్లలతో వాటివల్ల వచ్చే నష్టాల గురించి ఎప్పటికప్పుడు చెప్పాలి. ఆన్లైన్ ట్రెండ్స్ వల్ల ఇబ్బందుల గురించి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లు ఏ గేమ్ ఆడుతున్నారు? ఏ యాప్స్ వాడుతున్నారు? అనేది చూడాలి. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారో చూసి.. మంచి, చెడుల గురించి చెప్పాలి. పిల్లలకు ఇబ్బంది అనిపిస్తే మీతో ఫ్రీగా మాట్లాడమని చెప్పాలి. ఎలాంటి పరిస్థితులైనా కూల్గా స్పందించి వాళ్ల సమస్య తీరుస్తామనే భరోసా వాళ్లలో కల్పించాలి.
ప్రొఫైల్స్ ప్రైవేట్గా ఉంచొద్దని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరితో చెప్పొద్దని వాళ్లకు వివరంగా చెప్పాలి. సోషల్ మీడియాలో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్లని బ్లాక్ చేయమని, ప్రొఫైల్ రిపోర్ట్ కొట్టమనాలి. స్కూల్ వివరాలు, ఫోన్ నంబర్, పూర్తిపేరు లాంటివి ప్రొఫైల్లో పెట్టకూడదని చెప్పాలి.