- ఎంజీఎంలో పిల్లల వార్డు ఫుల్
- మందులన్నీ బయటే తెచ్చుకోమంటున్న డాక్టర్లు
- సర్కారు దవాఖానకు వెళ్లినా పేదలకు తప్పని ఖర్చు
వరంగల్, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లుతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో వైరల్ ఫీవర్ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఎంజీఎం హాస్పిటల్పిల్లల వార్డు ఫుల్అయ్యింది. ఒకే బెడ్డుపై ఇద్దరు పిల్లలను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు హాస్పిటల్స్కు వెళితే వేలల్లో బిల్లులు అవుతుండడంతో పేద, మిడిల్ క్లాస్ జనాలు అప్పుల భయంతో ఎంజీఎం ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీంతో ఎంజీఎంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే బెడ్లు లేవనే కారణంతో అడ్మిట్ చేయాల్సిన కేసులను సైతం నాలుగు మందులిచ్చి ఇండ్లకు పంపుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తిస్థాయిలో కంప్లీట్ అవని చిన్నారులను ముందే డిశ్చార్జీ చేస్తున్నారు. ఎంజీఎంలో హాస్పిటల్లో ఎప్పటి నుంచో 120 బెడ్ల పిల్లల వార్డ్ ఉంది. అధికారుల లెక్కల ప్రకారం.. సోమవారం నాటికే చిల్డ్రన్స్ వార్డులో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయిన పిల్లల సంఖ్య 188కి చేరింది. మంగళవారం కొందరిని డిశ్చార్జి చేసినా మళ్లీ కొత్తగా జాయిన్ అయిన వారితో పేషెంట్ల సంఖ్య 200కు చేరింది. ప్రతిరోజు 100 నుంచి 150 మంది వరకు ఓపీ కోసం క్యూ కడుతున్నారు. ఇందులో ఫీవర్ తీవ్రత ఆధారంగా 25 నుంచి 30 మందిని అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బెడ్లు లేని కారణంగా డాక్టర్లు క్రిటికల్ అయ్యే కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుని.. మిగతా వారందరికి మెడిసిన్ రాసి పంపిస్తున్నారు. మూడు రోజుల తర్వాత మరీ సీరియస్ అయితే మళ్లీ తీసుకురమ్మని సలహా ఇస్తున్నారు.
మందుగోలీలకు బయటకు..
ప్రైవేటు దోపిడీ తట్టుకోలేకే పబ్లిక్ మారుమూల పల్లెలు, జిల్లాలు దాటి ఎంజీఎం పిల్లల వార్డుకు వస్తున్నారు. ఇక్కడి డాక్టర్లు మాత్రం చిన్నపాటి మందుగోలీ, బ్యాండెడ్ కూడా బయటి మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాలని చిటీలు చేతిలో పెడుతున్నారు. హాస్పిటల్లో స్టాక్ అందుబాటులో లేదని.. లేదంటే బయట మంచి కంపెనీ మెడిసిన్ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందనే ఆశతో వచ్చే పేషెంట్లకు హాస్పిటల్లో ఉండే నాలుగైదు రోజుల మెడిసిన్స్కు వేలల్లో ఖర్చవుతోంది.
మందులన్నీ బయటే తెచ్చుకోమంటున్రు
మా పాపకి జ్వరం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లలేక ఎంజీఎం పిల్లల వార్డ్ కు తీసుకొచ్చిన. రెండోసారి వచ్చాక బెడ్ దొరికింది. అప్పటికే దానిమీద ఇంకో బాబు ఉన్నాడు. ట్రీట్మెంట్ విషయంలో ఫర్వాలేదని అనిపించినా.. డాక్టర్లు మందులన్నీ బయటి మెడికల్ షాప్ నుంచే తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఫీవర్ తగ్గకున్నా ముందే డిశ్చార్జీ చేస్తున్రు. - కె.అశోక్, జమ్మికుంట
బెడ్లు పెంచుతం
ఈ వారం ఎంజీఎం పిల్లల వార్డులో వైరల్ ఫీవర్ కేసులు పెరిగిన మాట వాస్తవమే. అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో ఒక్కోసారి ఒకే బెడ్మీద ఇద్దరికి చికిత్స అందిస్తున్నాం. పిల్లల్లో థర్డ్వేవ్ ఉంటుందనే భయంతో వారి కోసం మరో 100 బెడ్లు ఎప్పుడో ఏర్పాటు చేశాం. కానీ అది కొవిడ్ వార్డుకు దగ్గరగా ఉంది. అందుకే అల్టర్నేట్గా వేరే దారిలో మరో 100 నుంచి 120 బెడ్ల వార్డ్ పెంచుతాం. పిల్లలు దోమకాటు బారిన పడకుండా పేరేంట్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్