
మనీలా: దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం ఆగడాలపై ఫిలిప్పీన్స్ విరుచుకుపడింది. చైనా కోస్ట్ గార్డ్ దళం తమ దేశ కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ నౌకపై లేజర్ దాడి చేసిందని ఆరోపించింది. ఈ దాడిలో నౌకను నడిపే సిబ్బంది కళ్లపై ఎఫెక్ట్ పడి.. కాసేపటి వరకు వారికి ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ప్రమాద కరమైన మిలటరీ లేజర్తో రెండుసార్లు దాడి చేసిన వెంటనే చైనా కోస్ట్ గార్డ్ నౌక కవ్వింపునకు పాల్పడుతూ.. తమ నౌకకు 137 మీటర్ల దగ్గరికి వచ్చి వెళ్లింద ని పేర్కొంది. ఫిలిప్పీన్స్ సమీపంలోని దక్షిణ చైనా సముద్రంలో ఉన్న అయున్గిన్ షావోల్ దీవి వద్ద ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగిందని ఫిలిప్పీన్ ప్రభుత్వం వెల్లడించింది. అయున్గిన్ షావోల్ దీవి తమదేనని చైనా వాదిస్తోంది. గతేడాది ఆగస్టులోనూ ఈ దీవికి సమీపంలోకి ఫిలిప్పీన్స్ నేవీ పెట్రోలింగ్ షిప్ను రానివ్వకుండా చైనా సైన్యం అడ్డుకోవడంతో సైనిక ఉద్రిక్తత ఏర్పడింది.