చైనాలో ఆ చెత్తకుప్ప ముందే నిండింది

చైనాలో ఆ చెత్తకుప్ప ముందే నిండింది
  •  50 ఏళ్లనుకుంటే 25 ఏళ్లకే నిండిపోయిన చైనా జియాంగ్ ​కుంగూ డంపింగ్​ యార్డ్
  • రోజూ 2,500 టన్నుల చెత్త వేసేలా నిర్మాణం.. వస్తున్న చెత్త 10 వేల టన్నులకు పైనే
  • రీసైకిల్​ ప్లాంట్లు తక్కువ.. వచ్చే ఏడాది నాలుగింటిని ఏర్పాటు చేయనున్న చైనా

మనం ఇంట్లో మిగిలిపోయిన చెత్తను ఏం చేస్తం? ఇంటి ముందుకొచ్చే చెత్త బండిలో వేస్తాం. లేదంటే దగ్గర్లోని డస్ట్​బిన్​లో పడేస్తాం. మరి, ఆ చెత్తంతా ఎక్కడికి పోతోంది? ఆ చెత్తనంతా ఏం చేస్తున్నారు? మన హైదరాబాద్​ అయితే, ఠక్కున గుర్తొచ్చేది జవహర్​నగర్​ డంపింగ్​ యార్డ్​. రోజూ కొన్ని వందల టన్నుల చెత్త అక్కడ పోగుపడుతోంది. అలా అలా కొన్నేళ్లయితే ఆ చెత్తంతా ఏమవుతుంది? రీసైకిల్​ చేస్తే ఫర్వాలేదు, లేదంటే మాత్రం చెత్త కొండ పెరిగిపోతుంది. ఇప్పుడు చైనాను అదే సమస్య వేధిస్తోంది. ఆ దేశంలోనే అతిపెద్దదైన డంపింగ్​ యార్డు అనుకున్న టైం కన్నా ముందే నిండిపోయింది. 50 ఏళ్ల పాటు అది పనికొస్తుందనుకుంటే మధ్యలోనే చేతులెత్తేసింది. 50 ఏళ్లలో నిండిపోవాల్సిన డంపింగ్​ యార్డ్​, 25 ఏళ్లకే ఫుల్​ అయిపోయింది. అంతలా పోగుపడిపోతోంది అక్కడ చెత్త. ఆ డంపింగ్​ యార్డ్​ షాంక్సి ప్రావిన్స్​లో ఉంది. దాని పేరు జియాంగ్​కుంగూ. 100 ఫుట్​బాల్​ గ్రౌండ్​ల సైజులో ఉండే ఆ డంపింగ్​ యార్డ్​కు కెపాసిటీకి మించి చెత్త వస్తుండడంతో అనుకున్న టైంకు ముందుగానే అది ఫుల్లుగా నిండిపోయింది.

రోజూ 10 వేల టన్నుల చెత్త

1994లో జియాంగ్​కుంగూ డంపింగ్​ యార్డును ప్రారంభించారు. రోజూ 2,500 టన్నుల కెపాసిటీతో 2044 వరకు అక్కడ చెత్త వేసేలా దానికి డిజైన్​ చేశారు. 7 లక్షల చదరపుటడుగుల వైశాల్యం, 150 మీటర్ల లోతుతో 3.4 కోట్ల క్యుబిక్​ మీటర్ల కెపాసిటీతో దానిని కట్టారు. కానీ, అక్కడికి నాలుగు రెట్లు ఎక్కువగా, అంటే రోజూ దాదాపు 10 వేల టన్నుల చెత్త వచ్చి చేరుతోంది. దాదాపు 80 లక్షల మంది నుంచి వచ్చే వ్యర్థాలన్నీ అక్కడే పోగుపడిపోతున్నాయి. అంతమందికి అదొక్కటే డంపింగ్​ యార్డు ఉండడం వల్లే ఇంత తొందరగా అది నిండిపోయిందని అధికారులు అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో చెత్తను రీసైకిల్​ చేసే ఓ ప్లాంట్​ను అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మరో నాలుగింటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఐదు కలిసి రోజూ 12,750 టన్నుల చెత్తను ప్రాసెస్​ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చెత్తను ఒక చోట పోగు చేసే బదులు రీసైకిల్​ చేసి ‘ఎకోలాజికల్​ పార్క్​’గా మార్చాలని భావిస్తున్నారు.

ఎంత చెత్త?

చైనా స్టాటిస్టికల్​ ఇయర్​ బుక్​ ప్రకారం ఒక్క 2017లోనే 21.5 టన్నుల చెత్తను ఉత్పత్తి చేసింది. అది కూడా కేవలం సిటీల్లోనే. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 15.2 కోట్ల ఎక్కువ చెత్త ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా 654 డంపింగ్​ యార్డులుంటే, 286 రీసైకిల్​/డిస్పోజల్​ ప్లాంట్లున్నాయి. అయితే, 2020 చివరినాటికి 35 శాతం చెత్తను రీసైకిల్​ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. 2015లో షెంజెన్​ సిటీలో చెత్త డంప్​ కూలి 73 మంది చనిపోయారు. నిజానికి 40 లక్షల క్యుబిక్​ మీటర్ల కెపాసిటీతో 95 మీటర్ల ఎత్తులో దీనిని కట్టారు. కానీ, అది కూలిపోయినప్పటికి అక్కడ ఉన్న చెత్త 58 లక్షల క్యుబిక్​ మీటర్లు. 160 మీటర్ల ఎత్తులో పోగు పడింది.

వేరే దేశాల చెత్త అయితే కష్టం

నిజానికి 2017 దాకా విదేశాల చెత్తనూ చైనా రీసైకిల్​ చేసేది. కానీ, తన చెత్తను తానే డీల్​ చేసుకోలేకపోతున్న డ్రాగన్​ కంట్రీ, విదేశాల చెత్తను తీసుకోవడం ఆపేసింది. ఒక్క 2017లోనే యూరప్​, జపాన్​, అమెరికా నుంచి 70 లక్షల టన్నుల ప్లాస్టిక్​ చెత్త, 2.7 కోట్ల వేస్ట్​పేపర్​ చెత్తను డంపింగ్​ చేయించుకుంది. మలేసియా, టర్కీ, ఫిలిప్పీన్స్​, ఇండొనేసియాలూ చెత్తను తీసుకున్నా, చైనాతో పోలిస్తే తక్కువే. అయితే, ఉంటున్న కొద్దీ చెత్త ఎక్కువైపోతుండడంతో డీల్​ చేయలేక చైనా చేతులెత్తేసింది. చైనా బాటలోనే మిగతా ఆ దేశాలూ వెళ్లాయి. చెత్త దిగుమతిపై నిషేధం విధించాయి.