రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎఫ్సీఆర్ఏ రద్దు గురించి లోక్ సభలో ప్రస్తావన రావడంతో అమిత్ షా మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005– 2006, 2006 –2007 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు రూ.1.35 కోట్లు అందాయని ఆయన అన్నారు. అది ఎఫ్సీఆర్ఏ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అందుకే దాని రిజిస్ట్రేషన్ను కేంద్ర హోంశాఖ రద్దు చేసిందన్నారు. చైనా మీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.
అలాగే చైనా సరిహద్దు వివాదం పై మాట్లాడిన అమిత్ షా.. కాంగ్రెస్ హయాంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. అయితే.. ప్రధాని మోడీ అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారత్లో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని చెప్పారు.