చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అనగానే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా.. అందులోని సూపర్ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. సినిమా వచ్చి ముప్ఫై ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ పాటలకు, ఆ ఇద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఆ రోజులను గుర్తుచేసేలా మరోసారి శ్రీదేవితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు చిరంజీవి. కానీ ఈసారి శ్రీదేవిగా శ్రుతిహాసన్ కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం వీళ్లిద్దరిపై ఇటీవల యూరప్లో ఓ పాటను పిక్చరైజ్ చేశారు. ‘నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి’ అంటూ దేవి శ్రీ కంపోజ్ చేసిన ఈ పాటను సోమవారం విడుదల చేయబోతున్నారు.
శనివారం ఈ విషయం రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. మంచు కొండల మధ్య చిరంజీవి, శ్రుతిహాసన్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ పాటలో చిరంజీవి, శ్రీదేవిల ఐకానిక్ పెయిర్ ప్రస్తావన తీసుకురావడం మెగా ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘బాస్ పార్టీ’ సాంగ్ ఇరవై ఐదు మిలియన్స్ వ్యూస్ను క్రాస్ చేసింది. బాబి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తున్నారు.