హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఇకెబానా(జపాన్ సాంప్రదాయ పుష్పాలంకరణ కళ) దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్లోని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో ‘అవాంట్-గార్డ్ - ఇకెబానా ఎక్స్ప్రెషన్స్’ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ -250 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పెషల్సీఎస్ వాణి ప్రసాద్ హాజరయ్యారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమాపై బాంబు దాడి జరిగిన తర్వాత శాంతిని కాంక్షిస్తూ ఓహారా స్కూల్ మూడో హెడ్మాస్టర్ హౌన్ ఓహారా.. ఈ ‘అవాంట్-గార్డ్’ శైలిని రూపొందించారని నిర్వాహకులు తెలిపారు. నేటి ప్రపంచ యుద్ధ వాతావరణంలోనూ శాంతి, సామరస్యాల అవసరాన్ని చాటిచెప్పేలా ఈ థీమ్ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. కాగా, హైదరాబాద్ చాప్టర్ సభ్యులు రూపొందించిన 25 రకాల విశిష్ట అలంకరణలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ప్రదర్శనను పలువురు ప్రముఖులు సందర్శించి అభినందించారు.
