ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో సివిల్, -వైమానిక దళ సంయుక్త విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, ఇతర పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎయిర్పోర్ట్ పనులపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278.14 కోట్లు మంజూరు చేసిందన్నారు. మొత్తం 2,009.23 ఎకరాల్లో వైమానిక దళ శిక్షణ కేంద్రంతో పాటు పౌర విమానయాన సేవలు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్, కార్గో సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి, అర్హులకు సత్వరమే పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్ రావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతల సంబురాలు
ఆదిలాబాద్ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంతో సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం రూ.2278.14 నిధులు విడుదల చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మాజీ ఎంపీ సోయం బాపురావ్, అల్లూరి సంజీవరెడ్డి, మల్లెపూల నరసయ్య, సాజిద్ఖాన్, బి.శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితలు పాల్గొన్నారు. కలెక్టరేట్ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ జి.నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిరంతర కృషితోనే ఎయిర్పోర్ట్ కల సాకారమైందన్నారు. నాయకులు శ్రీకాంత్, గంటా జీవన్, సాయి, రాకేశ్, వేదవ్యాస్, దినేశ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
