న్యూఢిల్లీ: దేశంలో ఏటా రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని (గ్రాస్ టోటల్ ఇన్కమ్) ఆదాయపు పన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) చూపిస్తున్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య గత ఐదేళ్లలో ఏకంగా నాలుగు రెట్లకు పైగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లోక్ సభకు తెలిపింది. ‘‘ అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2021–-22లో కేవలం 142 మంది మాత్రమే రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపగా, ఏవై 2025–-26 నాటికి ఈ సంఖ్య 576 కి చేరుకుంది”అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరించారు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 'బిలియనీర్' అనే పదానికి ఎలాంటి చట్టబద్ధమైన నిర్వచనం లేదని, కేవలం రూ. 100 కోట్లు దాటిన వారి సమాచారాన్ని మాత్రమే ట్రాక్ చేస్తామని స్పష్టం చేశారు. 2016లో వెల్త్ టాక్స్ రద్దు చేసినందున ఇన్వెస్టర్ల మొత్తం సంపద వివరాలను మేనేజ్ చేయడం లేదని అన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయని తెలిపారు. మరోవైపు 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2022లో 3.6శాతం ఉండగా, 2025 నాటికి 3.1శాతానికి తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది.
