- రెవెన్యూ రూ.16.24 లక్షల కోట్లు
- రాణించిన టాటా ఎలక్ట్రానిక్స్.. 4 ఏళ్లలోనే నాల్గో అతిపెద్ద గ్రూప్ కంపెనీగా అవతరణ
- యాన్యువల్ రిపోర్ట్లో చైర్మన్ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.16.24 లక్షల కోట్ల రెవెన్యూ సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. కంపెనీ నికర లాభం ఏకంగా 51.9 శాతం పెరిగి రూ.1,70,525 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఖర్చులు పెంచినా గ్రూప్ అదిరిపోయే ఫలితాలను సాధించింది.
టాటా కంపెనీల పేరెంట్ సంస్థ 'టాటా సన్స్' యాన్యువల్ రిపోర్ట్లో ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ వివరాలను పంచుకున్నారు. 2019–20 నాటి స్థాయిలతో పోలిస్తే రాబడి 2.1 రెట్లు, లాభాలు 5.4 రెట్లు పెరిగాయని తెలిపారు.
యాన్యువల్ రిపోర్ట్ వివరాలు..
టాటా సన్స్ ఆదాయం 2025–26 లో ఏడాది లెక్కన 9.1శాతం పెరిగి రూ. 42,367 కోట్లకు చేరుకోగా, లాభం 21.8శాతం వృద్ధితో రూ. 31,961 కోట్లుగా నమోదైంది. వాటాదారులకు ప్రతి షేరుపై రూ. 1,10,717 డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేసింది.
టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో వేగంగా విస్తరిస్తూ రూ. 1,31,082 కోట్ల రాబడితో గ్రూప్లో 4వ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. గ్లోబల్గా తయారవుతున్న యాపిల్ ఫోన్లలో 12 శాతం ఈ కంపెనీనే తయారు చేస్తోంది. 86,466 మంది సిబ్బంది ఈ సంస్థలో పనిచేస్తుండగా వీరిలో మూడింట రెండొంతుల మంది మహిళలు ఉన్నారు.
బ్యాటరీ తయారీ సంస్థ అగ్రాతాస్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ కోసం హై క్వాలిటీ బ్యాటరీలను డిజైన్, డెవలప్, మాన్యుఫాక్చర్ చేస్తున్నామని చంద్రశేఖరన్ తెలిపారు.
టాటా డిజిటల్: బిగ్బాస్కెట్కు 2025–26లో రూ.4,974 కోట్ల నష్టం వచ్చినా, గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ) రూ. 46,515 కోట్లకు పెరిగింది.
ఎయిర్ ఇండియా నష్టం రూ.22,238 కోట్లు
ఎయిర్ ఇండియా నష్టాలు 2025-26 లో ఏకంగా రూ.22,238 కోట్లకు పెరిగాయి. అయినా టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాత్రం కంపెనీకి మద్ధతుగా నిలిచారు. గొప్ప ఎయిర్లైన్ సంస్థలను నెలల్లో నిర్మించలేమని, దశాబ్దాలు పడుతుందని తెలిపారు. ఎయిర్ ఇండియా రీస్ట్రక్చర్ ప్రాసెస్ను 5 నుంచి 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంగా చూడాలని షేర్ హోల్డర్ల రిపోర్ట్లో పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడంతో పాటు ఎయిర్స్పేస్ మూతపడడం, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, ఏఐ 171 ప్రమాదం వంటి సవాళ్లు కిందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఎయిర్ ఇండియా గ్రూప్ ఆదాయం రూ.76,754 కోట్ల నుంచి 70,086 కోట్లకు తగ్గగా, లో-కాస్ట్ విమాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రూ. 6,767 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దేశీయ రూట్లలో నడిచే చిన్న విమానాల రీఫర్బిష్మెంట్ పూర్తయిందని, పెద్ద విమానాల రీఫర్బిష్మెంట్ ప్రాసెస్ 2027-28 చివరి నాటికి పూర్తవుతుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. కస్టమర్ సంతృప్తి కొలిచే ఎన్పీఎస్ స్కోర్ -35 (2022-23) నుంచి జూన్ 2026 నాటికి +42 కి భారీగా మెరుగైందని వివరించింది. కాగా, ఈ ఏడాది జూన్లో ఆన్ టైమ్ అరైవల్ పెర్ఫార్మెన్స్లో ఎయిర్ ఇండియా టాప్లో నిలిచింది.
