కైకాలను ఫోన్లో పరామర్శించిన చిరంజీవి

కైకాలను ఫోన్లో పరామర్శించిన చిరంజీవి

ప్రముఖ సీనియర్ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే కైకాల ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారన్నారు. ఆయన స్పృహలోకి వచ్చారని తెలియగానే వెంటనే కైకలకు చికిత్స చేస్తున్న డాక్టర్ సుబ్బారెడ్డి సాయంతో ఫోన్లో పలకరించానన్నారు చిరంజీవి. 

ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగిందన్నారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా.. మళ్లీ త్వరలో ఇంటికి  తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చిరు ఫోన్లో అన్నప్పుడు.. కైకాల నవ్వుతూ థంబ్స్ అప్ సైగ చేసి థాంక్యూ అని చూపించినట్లుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు చిరుకు తెలిపారన్నారు. కైకాల సత్యనారాయణ సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోను ఈ విషయం పంచుకోవడం సంతోషంగా ఉందని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.