డ్రోన్‌ దాడికి సెకన్ల ముందే టెర్రరిస్టులు కాదని తెలిసింది: అంతలోనే..

డ్రోన్‌ దాడికి సెకన్ల ముందే టెర్రరిస్టులు కాదని తెలిసింది: అంతలోనే..

గత నెలలో అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో కారుపై డ్రోన్ అటాక్‌లో తమ పొరబాటు కారణంగా 10 మంది సామాన్య పౌరులు మరణించారని, ఇందుకు తమ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నామని యూఎస్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది.  కాబూల్‌లోని ఎయిర్‌‌పోర్టుపై ఐఎస్‌–కే టెర్రిరిస్టులు దాడి చేసే ముప్పు ఉందన్న సమాచారంతో ఆగస్టు 29న అమెరికా ఆర్మీ ఒక డ్రోన్ అటాక్ చేసింది. ఎయిర్‌‌పోర్టుకు దగ్గరలోని ఓ ఏరియాలో టయోటా కారులో టెర్రరిస్టులు దాడికి సిద్ధంగా ఉన్నారని, వెంటనే వాళ్లను మట్టుబెట్టాలని హెల్‌ఫైర్ మిస్సైల్‌ను లాంచ్ చేశారు యూఎస్ సైనికులు. ఆ డ్రోన్ దాడిలో 10 మంది మరణించారు. అయితే అందులో ఉన్నది టెర్రరిస్టులు కాదు.. సామాన్య పౌరులు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏకు అందిన తప్పుడు సమాచారం కారణంగానే ఈ ఘోరం జరిగిందని యూఎస్ ఆర్మీ వెల్లడించింది. అయితే సరిగ్గా డ్రోన్ అటాక్‌ లాంచ్‌ చేసే కొద్ది సెకన్ల ముందే సీఐఏకు టార్గెట్ చేసిన ప్లేస్‌లో ఉన్నది టెర్రరిస్టులు కాదని, పిల్లలు, సామాన్య జనం అని సమాచారం అందిందని తెలిపింది. ఆ సమాచారం వెంటనే కమాండర్‌‌కు చేరవేసేలోపే ఆలస్యం అయిందని, అంతలోనే అటాక్ లాంచ్‌ చేసేశారని, చిన్న ఇంటెలిజెన్స్ లోపం కారణంగా పది మంది సామాన్యుల ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

కాబూల్ లో ఐఎస్ టెర్రరిస్టుల వెహికల్ ను టార్గెట్ గా చేసుకుని ఆగస్టు 29న తాము జరిపిన డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారులతో సహా 10 మంది పౌరులు చనిపోయారని యూఎస్ మిలిటరీ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకింజీ ఎట్టకేలకు తప్పును ఒప్పుకొన్నారు. డ్రోన్ దాడి చేసిన వెంటనే పౌరులు చనిపోయారని వార్తలు వచ్చినా, అమెరికా ఖండించింది. డ్రోన్ దాడిలో చనిపోయిన వాళ్లకు టెర్రరిస్టులతో సంబంధంలేదని తాజా దర్యాప్తులో తేలింది. దీంతో ఫ్రాంక్ మెకింజీ తప్పును ఒప్పుకున్నరు. ‘ఆర్మీ కంబాటెంట్ కమాండర్​గా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్తున్నా. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇస్తున్నా..” అని ఆయన మీడియా ముందు వెల్లడించారు.