న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కారణంగా జరిగిన ఆత్మహత్యలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పందించింది. బాధితుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బహిరంగ లేఖ రాశారు.
గత వారంలో 11 మంది, గడిచిన 48 గంటల్లోనే ఐదుగురు నీట్ అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతోమంది తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విద్యా రుణాలు తీసుకున్నారని, వ్యవస్థాగత లోపాల వల్ల వారి కలలు ముక్కలై ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని లేఖలో తెలిపారు.
పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల వల్ల రద్దయిన విషయం తెలిసిందే.
