- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి సీజేపీ భారీ నిరసన
- చీకటి పడగానే లైట్లు ఆపేసిన పోలీసులు
- మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో కొనసాగిన ఆందోళన
- మాపై దాడి జరిగితే లైట్లు ఆపినవాళ్లదే బాధ్యత: అభిజీత్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కదలబోనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ అవకతవకలు వంటి విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ రెండో దశ ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో జూన్ 6 న నిర్వహించిన తొలి ఆందోళన కన్నా పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. స్టీల్ ప్లేట్లను చెంచాలతో మోగిస్తూ ‘‘ప్రధాన్ గో బ్యాక్, గో ప్రధాన్ గో(ధర్మేంద్ర ప్రధాన్)’’ అంటూ నినాదాలు చేశారు. సీజేపి ఆందోళన నేపథ్యంలో కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మొబైల్ ఫోన్ల లైట్లతో ఆందోళన
పోలీసుల అనుమతితో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 5 గంటల వర కు కొనసాగింది. ఆ తరువాత సమయం పొడిగించాల ని అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. అయితే, సమయం పొడిగించేందుకు పోలీసులు ఒప్పు కోలేదు. ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే యువత మాత్రం జంతర్ మంతర్ ను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. దాంతో పోలీసులు చీకటి పడగానే జంతర్ మంతర్ వద్ద లైట్లను ఆఫ్ చేశారు. నీటి సరఫరాను నిలిపివేశారు.మీడియాను అడ్డుకున్నారు. కానీ యువత మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో ఆందోళనను కొనసాగించారు. ఇక పోలీసులు చేసేదేమి లేక చివరకు మళ్లీ లైట్లు ఆన్ చేశారు.
ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. చీకట్లో తనపై ఏదైనా దాడి జరిగితే, లైట్లు ఆపివేసిన వారే బాధ్యులు అవుతారన్నారు. తమపై తీసుకుంటున్న చర్యల్లో కొంతైన ఎగ్జామ్స్ కోసం తీసుకుని ఉంటే పేపర్ లీకేజీలు జరిగి ఉండేవి కావన్నారు. 12 మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదని చెప్పారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ..మన ప్రతినిధుల పిల్లలు కూడా అందరి పిల్లలతో పాటు ఒకే పాఠశాలలకు వెళ్లినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని పేర్కొన్నారు.
