సైఫాబాద్, వెలుగు: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం సమావేశమయ్యారు. సీజేపీ నేతలు రుచిత్ ఆశా కమల్, విజయ్ మల్లంగి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరితో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారిందని విమర్శించారు.
మోదీ ప్రధానిగా 12 ఏండ్లు పూర్తి చేసుకున్నారని సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నాయకులకు నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సమావేశం నిర్వహిస్తున్నామని, విద్యార్థి సంఘ నాయకులు, నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
