సీఎం జగన్ పై దాడి: రంగంలోకి దిగిన క్లూస్ టీమ్

సీఎం జగన్ పై దాడి: రంగంలోకి దిగిన క్లూస్ టీమ్

సీఎం, జగన్ పై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పైనుంచి దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తోంది క్లూస్ టీమ్. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీస్ అధికారులు.

ఈ క్రమంలో ఘటనాస్థలికి సమీపంలో ఉన్న వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. కుడివైపు ఇళ్లు ఉండడంతో ఎడమవైపు ఉన్న స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. 30 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు.

మరోవైపు పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది.కాగా వైద్యుల సూచన మేరకు సీఎం జగన్ శనివారం రాత్రి హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.