V6 News

కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆయన ప్రకటించారు. రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని.. అయినప్పటికీ ప్రజలపై భారం పడకూడదని కరెంట్ ఛార్జీలను పెంచొద్దని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బుధవారం (డిసెంబర్ 10) మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీపీఎలను రద్దు చేసి గత వైసీపీ ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది.. దానిని ఇప్పుడు  రూ.4.92కు తగ్గించామని తెలిపారు. వచ్చే ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. 

అందరం కలిసి సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నారు. ఒక్క ఆసరా పెన్షన్లే ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లకు పైగా పేదలకు పంపిణీ చేశామని చెప్పారు. ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అని.. కానీ గత పాలకుల వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి తీసుకురాగలిగామని అన్నారు. విశాఖ సదస్సులో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని.. మన యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎస్ఐపీబీలు పెట్టుకుని పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నామని వివరించారు. 

మొదటి త్రైమాసికంలో 12.02 శాతం గ్రోత్ రేట్ రాగా.. రెండో త్రైమాసికంలో 11.28 శాతం వృద్ధి నమోదు అయ్యిందని తెలిపారు. 8.70 శాతం జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించగలిగామన్నారు. ఇక భవిష్యత్ కాలానికి 17.11 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధి గురించి పార్లమెంటులో చెప్పుకునే స్థాయిలో మనం అభివృద్ధి చెందుతున్నామన్నారు. నీటి భద్రత విషయంలో ముందు చూపుతో పని చేశామని.. సాగు నీటి ప్రాజెక్టుల్లో 944 టీఎంసీల నిల్వ చేసుకున్నామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులంతా శాస్త్రీయంగా ఆలోచన చేసి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.

రాష్ట్రాన్ని జోన్లుగా, రీజియన్లుగా, కారిడార్లుగా, క్లస్టర్లుగా, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని చెప్పారు. అన్ని శాఖలు, అన్ని ప్రభుత్వ సేవల్లో ప్రజల్లో సంతృప్త స్థాయిని నమోదు చేస్తున్నామని.. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలతో చక్కగా వ్యవహరించాలని సూచించారు. టీటీడీ పనితీరు మెరుగు అవుతోంది.. కానీ దేవదాయ శాఖ పని తీరు మెరుగు పడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. 2026, జనవరి 15 నాటికి అన్ని సేవలఉ ఆన్ లైన్ విధానానికి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు.