
జగిత్యాల రూరల్ మండల స్థాయి సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన యువకులు అడిషనల్ కలెక్టర్ మకరంద్ ముందే ఆందోళనకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన వాలిబాల్ టీమ్ సీఎం కప్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వచ్చారు. వీరు పలు జట్ల పై పోటీ చేసి విన్నర్ గా నిలిచారు. అయితే గెలిచిన తమ జట్టును రన్నర్ గా ప్రకటించారని.. విన్నింగ్ టీమ్ రన్నర్ టీమ్ గా ప్రైజ్ ఎలా తీసుకుంటారని జట్టు సభ్యులు మండిపడ్డారు. తమ జట్టుకు ఓ బీజేపీ స్థానిక లీడర్ టీ షర్ట్స్ స్పాన్సర్ చేశారని.. వాటిపై బీజేపీ కమలం గుర్తు ఉండటంతోనే ఇలా తమపై వివక్ష చూపుతున్నారని సదరు టీం సభ్యులు ఆరోపించారు.ఈ విషయంపై మే 18వ తేదీ బుధవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ కు పిర్యాదు చేశారు యువకులు.
కాగా, ‘సీఎం కప్’ తొలి దశలో మండల స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయని శాట్స్ ప్రకటించింది. సోమ, మంగళ, బుధ వారాల్లో దాదాపు 618 మండలాల్లో జరిగిన ఈ పోటీల్లో ఐదు క్రీడల్లో దాదాపు 2 లక్షల మంది పోటీ పడ్డారని, అందులో నుంచి దాదాపు 85 వేల మంది జిల్లా లెవెల్ పోటీలకు ఎంపికైనట్లు నివేదికలు అందాయని శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.