ఏపీలో  “వైఎస్సార్‌ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఏపీలో  “వైఎస్సార్‌ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంచ్ చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు సాయం..

ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లపాటు రూ.75 వేల సహాయం

రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది భర్త లేని ఒంటరి మహిళలకు లబ్ది

జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు  చేసుకోండి: వైఎస్ జగన్

అమరావతి: చరిత్రాత్మక రీతిలో వైయస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని తన నివాస కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు.. అధికారులతో మాట్లాడి పథకాన్నా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల నుండి కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనగా.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్, శంకరనారాయణ, ఎంపీ మార్గాని భరత్, సీఎస్‌ నీలం సాహ్ని, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయా జిల్లాల్లో హాజరైన ఒంటరి మహిళలు.. నేతలు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. దేవుడి దయతో వైయస్సార్‌ చేయూతను ప్రారంభిస్తున్నాం.. ఈ పథకాన్ని నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పాదయాత్ర జరుగుతున్నప్పుడు 45–60 ఏళ్ల మధ్యనున్న అక్కచెల్లెమ్మలు తనను కలసి  ప్రభుత్వ పథకాలేవీ వర్తించడం లేదని ఎంతో బాధతో చెప్పారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకున్నా.. కుటుంబాలను నడిపించే బాధ్యత వీరిదే.. వీరికి మంచి జరిగితే.. మొత్తం కుటుంబానికి మంచి జరిగినట్టే.. వీరికి మంచి జరగాలనే ఈ పథకం ప్రారంభిస్తున్నానన్నారు.

గతంలో కార్పొరేషన్ల పేరుతో రుణాలు ఇచ్చేవారు.. ఊర్లో వేయిమంది ఉంటే.. ఒకరికో, ఇద్దరికో రుణాలు వచ్చే పరిస్థితి.. అదికూడా రాజకీయ పలుకుబడి ఉండి, లంచాలు ఇచ్చుకుంటేనే.. దీనివల్ల ఎవ్వరికీ ఏమీ జరిగేది కాదు, ఎవ్వరికీ ఉపయోగపడేది కాదు.. మిగిలిన వాళ్లు బాధపడే పరిస్థితి ఉండేది. ఇవన్నీ మార్పులు చేస్తూ, ఈవయస్సులో ఉన్న అక్కలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లను ప్రక్షాళన చేశామన్నారు సీఎం జగన్.

మొదట పెన్షన్‌ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నాం.. ఆరోజుల్లో వేయి రూపాయలు అనుకుంటే.. ఏడాదికి రూ.12వేలు..  45ఏళ్లకే పెన్షన్‌ ఏంటి? అంటూ మమ్మల్ని వెటకారం చేశారు.. పోనీలే అనుకుని… ఏడాదికి రూ.12వేలు కాదు, రూ.18750 ఇస్తాం, నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి పథకాన్ని తీసుకు వచ్చామని వివరించారు. ప్రతి ఏటా రూ.18750 చొప్పున 4 ఏళ్లపాటు రూ. 75వేలు ఆ అక్కకు ఇస్తున్నాం.. తమ జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తుంది.. దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం.. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పా.. మీ తమ్ముడిగా, అన్నగా చేయగలుగుతున్నానని జగన్ వివరించారు. ఈ పథకంలో ఒక అడుగు ముందుకు వేశాం.. అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నాం.. పాత అప్పులకి జమచేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నాం.. దీనికోసం బ్యాంకులతో మాట్లాడా.. నిలదొక్కుకోవడానికి వ్యాపార అకాశాలను ముందుకు తీసుకు వచ్చాం.. పాల రంగంలో దేశంలోనే దిగ్గజ సంస్థ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం.. రియలన్స్, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నామని.. రాబోయే కాలంలో మరిన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మహిళలకు వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు సీఎం జగన్.

ప్రతి అక్కకు, చెల్లెమ్మకు 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం:

ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే…  ఆప్షన్‌ ఇవ్వొచ్చు.. దీనికోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.. కంపెనీలు.. తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటుకన్నా తక్కువ రేటుకు తమ ఉత్పత్తులను ఇస్తారు.. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకున్న మహిళలు ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.. ఆర్థికంగా వృద్దిచెందేలా సుస్థిర జీవనోపాధి పొందవచ్చు.. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మిమ్మల్నిఅందర్నీకూడా.. ఈ రెండు పేజీల లేఖతో మీ ముందుకు వస్తారు.. తమకు మేలు జరుగుతుందని అక్కలు అనుకున్నప్పుడు.. ఆ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న తర్వాత సెర్ప్, మెప్మా ప్రతినిధులు ఆ మహిళతో మాట్లాడతారు… కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతారు, బ్యాంకులతో ఆ అధికారులు మాట్లాడుతారు.. ఆ వ్యాపారంలో వాళ్లు అడుగుపెట్టేలా ముందుకు సాగుతారని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లవరకూ ఉన్న మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల వరకూ ఇస్తున్నాం..  ప్రతి ఏటా రూ.18750 లు ఇస్తాం..  ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి.. అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి.. కాని, ఇదే చేయాలని ఏ అక్కమీద కూడా ఆంక్షలు లేవు.. ఇది పూర్తిగా మీ స్వేచ్ఛ.. డబ్బు దేనికి వాడుకోవాలన్నది వారి ఇష్టం.. ప్రభుత్వం చూపించిన అవకాశాల వల్ల లాభం జరుగుతుందని అనుకుంటే.. వారికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదు.. గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోండి.. వచ్చే నెలలో ఈ దరఖాస్తులను పరిశీలించి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటారని జగన్ చెప్పారు. మహిళలకు 60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం కొనసాగుతుంది.. అక్కడ నుంచి వారికి పెన్షన్‌ ప్రారంభం అవుతుంది.. ఆ సమయానికి ఏడాదికి దాదాపు రూ.30వేల రూపాయలు వస్తాయి.. 45 ఏళ్లు వయసు చేరుకున్న తర్వాత ప్రతి ఏటా మహిళలు ఈ పథకంలోకి వస్తారు..అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఈ కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.