మంత్రుల అభిప్రాయం కోరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 12 శాసన మండలి స్థానాలకు అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందో చెప్పాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ మంత్రులను కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై శనివారం ప్రగతి భవన్లో మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేయడానికి ఈ నెల 23 దాకా గడువుంది. సంఖ్యాబలం లెక్కలు తీసుకుంటే అన్ని స్థానాలు టీఆర్ఎస్కే దక్కే అవకాశముంది. ఈనేపథ్యంలో ఒక్కో జిల్లా నుంచి ఐదారుగురు ఆశావహులు తమకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని స్థానాల్లో బీజేపీ, మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులతో ఎదురుదెబ్బ పడుతుందని టీఆర్ఎస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి పడకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించకున్నా.. ఎవరెవరు ఎక్కడ నామినేషన్ వేయాలనే విషయం వాళ్లకు ఫోన్లో చెప్పినట్టు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో వాళ్ల గెలుపు బాధ్యతలపై మంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సోమ, మంగళవారాల్లో పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.