- వాస్తు దోషమే కారణమని చర్చ
- అధునాతన హంగులతో కొత్త డిజైన్
- శరవేగంగా భవన నిర్మాణ పనులు
- కార్తీక మాసంలో గృహ ప్రవేశం
- వాస్తు దోషమే కారణమని చర్చ
- అధునాతన హంగులతో కొత్త డిజైన్
- శరవేగంగా భవన నిర్మాణ పనులు
- కార్తీక మాసంలో గృహ ప్రవేశం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్హౌజ్లో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న నిర్మాణాలను రెండు నెలల కిందే కూల్చివేశారు. అదే పరిసరాల్లో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. జూన్ చివరివారంలోనే భూమి పూజ చేశారని, ప్రస్తుతం పునాదులు తీసి, ఫిల్లర్లు వేసే పనులు చకచకా జరుగుతున్నాయి. దీంతో రెండు నెలల కిందటి వరకు భారీ భద్రత, సీఎం రాకపోకలతో కళకళలాడిన ఎర్రవల్లి ఫామ్హౌజ్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. గతంలో ఉన్న బిల్డింగ్ వాస్తుకు అనుగుణంగా లేదని, అందుకే పాతది కూలగొట్టి.. సీఎం కొత్త భవంతి కట్టుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.
వేగంగా భవన నిర్మాణం
హైదరాబాద్కు 65 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో సీఎం ఫామ్హౌజ్ ఉంది. తొమ్మిదేళ్ల కింద ఎర్రవల్లిలో సాగుభూమి కొనుగోలు చేసిన కేసీఆర్.. అక్కడే ఫామ్హౌజ్ నిర్మించుకున్నారు. అప్పుడు వాస్తుకు అనుగుణంగా ఫామ్హౌజ్లో నైరుతి వైపున బిల్డింగ్ కట్టించారు. గ్రౌండ్ ఫ్లోర్ను ఖాళీగా ఉంచి పై రెండంతస్తులను గెస్ట్ హౌజ్గా ఉపయోగించారు. సీఎం సెక్యూరిటీ పోస్టును, పంట ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు గోడౌన్లను నిర్మించారు. ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా కేసీఆర్ ఈ ఫామ్హౌజ్కు వెళ్లి వ్యవసాయ పనులు, పొలాలను దగ్గరుండి చూసుకునేవారు. ప్రతి నెలలో వారం పది రోజులు అక్కడే గడిపే వారు. పార్టీ ముఖ్య నేతలు అక్కడికి వెళ్లే సీఎంను కలుసుకునే వారు. 2015 డిసెంబర్లో ఈ ఫామ్ హౌజ్ పరిసరాల్లో అత్యంత వైభవంగా ఐదు రోజుల పాటు అయుత మహా చండీ యాగం కూడా చేయించారు. ఆ యాగం చివరిరోజున ప్రమాదవశాత్తు యాగశాలకు నిప్పంటుకుంది. వాస్తు దోషమే దానికి కారణమని వాస్తు నిపుణులు, పండితులు సీఎంకు చెప్పినట్టు చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్కు అనుకొని ఉన్న కొంత భూమిని కొనుగోలు చేసి, కలుపుకోవడంతో నైరుతి పెరిగిందని, దాంతో వాస్తు దెబ్బతిందని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో పండితుల సలహాలు, సూచనల మేరకు నైరుతి మూలలో కొత్త భవనం నిర్మాణం చేపట్టారని, అధునాతన హంగులతో డిజైన్ రూపొందించారు. ప్రగతిభవన్లోని ఇంటి తరహాలోనే అన్ని సదుపాయాలు ఉండేలా నిర్మిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి కావాలని, కార్తీక మాసంలో గృహప్రవేశం చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. అందుకే శరవేగంగా పనులు జరుగుతున్నాయి.