- జాతీయ పార్టీ కార్యాచరణపై చర్చిస్తున్నారంటున్న టీఆర్ఎస్ లీడర్లు
- లిక్కర్ స్కామ్పై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారంటున్న ప్రతిపక్షాలు
- సీఎస్, డీజీపీకి సీఎం ఢిల్లీ పిలుపు.. రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిన ఆసక్తి
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశమైంది. వారం రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఎందుకు ఉంటున్నారు..? అక్కడేం చేస్తున్నారు..? అనేదానిపై అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి. మునుగోడు బై పోల్ను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఏ ఎలక్షన్కు లేని విధంగా రాష్ట్ర కేబినెట్ను, ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి తరలించారు. స్వయంగా ఆయన ఒక గ్రామానికి ఇన్చార్జ్గా ఎలక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇదే టైమ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి చెందిన లీడర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, సీబీఐ ప్రత్యేక బృందాలు హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు నిర్వహించాయి. ఇప్పటికే పలువురిని విచారించాయి. కొందరు లీడర్లకు స్కామ్తో సంబంధాలున్నాయనే వార్తలు టీఆర్ఎస్లో కలకలం రేపాయి. ఈ టైమ్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం.. వారం రోజులుగా అక్కడే ఉండటం ఆసక్తిరేపుతున్నది.
2 రోజులు పార్టీ ఆఫీసు పనులు పరిశీలించి!
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కోసం రెంట్కు తీసుకున్న ఆఫీస్ రిపేర్లు, పార్టీ సొంత భవన నిర్మాణ పనులను మొదటి రెండు రోజులు ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వాస్తు నిపుణులను అక్కడికి పిలిపించుకొని సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఐదురోజులుగా కేసీఆర్ ఎవరినీ కలువకపోవటం గమనార్హం. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపైనే వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో పలువురు న్యాయ నిపుణులతో ఢిల్లీలో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఎప్పుడు వచ్చినా మూడురోజులు ఉంటుండె..!
సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా దాదాపు మూడు రోజుల్లో పనులు ముగించుకొని హైదరాబాద్కు తిరుగు పయనమయ్యేవారు. కానీ, ఏడాది కాలంగా ఆయన షెడ్యూల్లో పూర్తి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 5 సార్లు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లగా.. ప్రతిసారి దాదాపు వారంపాటు అక్కడే ఉన్నారు. ఈ నెల 11 నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. మరో మూడు రోజులు అక్కడే ఉంటారని సమాచారం. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో పలువురు న్యాయ నిపుణులతో ఢిల్లీలో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేసీఆర్ డైలీ షెడ్యూల్ను సీఎంవో రిలీజ్ చేయటం లేదని, అంతా గోప్యత పాటిస్తున్నారని ఢిల్లీలోని మీడియా వర్గాలు చెప్తున్నాయి. రాజకీయపరమైన అంశాలు, కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకునే పనిలో తరచూ కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నెల 11న ములాయంసింగ్ అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్.. అదేరోజు అటు నుంచే ఢిల్లీకి వెళ్లారు. కూతురు కవిత, ఎంపీ సంతోష్ కేసీఆర్వెంటనే ఉంటున్నారు.
మునుగోడు బైపోల్ మానిటరింగ్
వారం రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచే మునుగోడు ఉప ఎన్నికను మానిటర్ చేస్తున్నారు. నేతల ప్రచార తీరుతెన్నులు, పార్టీలో చేరికలు వలసలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రులను, ఎమ్మెల్యేలను పదిరోజుల కిందట్నే మునుగోడు నియోజకవర్గంలో దింపిన కేసీఆర్.. ప్రతి ఓటరును కలవాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్, పార్టీ స్పెషల్ స్వ్వాడ్ నుంచి వస్తున్న రిపోర్టుల ఆధారంగా లీడర్లను ఆయన అలర్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఢిల్లీకి సీఎస్, డీజీపీ
సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండటంతో.. సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి హుటాహుటిన అక్కడికి వెళ్లారు. సీఎం పిలుపుతోనే వీరిద్దరూ బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు. అమృత్, పీఎం అవాస్ యోజన కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 3,500 కోట్లు రావాల్సి ఉన్నదని, ఈ నిధులపై చర్చించేందుకు సీఎస్, స్పెషల్ సీఎస్ ఢిల్లీ వెళ్లినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. సీఎంతో పాటు మంత్రులెవరూ లేకపోవటంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు స్తంభించి పోయాయి.