జానారెడ్డి సవాల్​తో స్వయంగా రంగంలోకి దిగుతున్న సీఎం

జానారెడ్డి సవాల్​తో స్వయంగా రంగంలోకి దిగుతున్న సీఎం
  • జానా కోసమే రెండోసారి సాగర్​కు కేసీఆర్
  • సీనియర్​ నేత కావడంతో ఎవరు విమర్శించినా ఆయనకే ప్లస్​అవుతోందట!
  • అందుకే కేటీఆర్​ రోడ్డు షో రద్దు చేశారని టాక్​
  • గతంలో ఎప్పుడూ లేనట్లుగా సాగర్​లో ప్రచారానికి రెండోసారి

నల్గొండ, వెలుగు: సాగర్​ఉప ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అమలుచేస్తున్న ఎన్నికల వ్యూహాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్​ నుంచి సీనియర్​ లీడర్​ జానారెడ్డి బరిలో ఉండడం, ఆయనను విమర్శించే స్థాయి నేత అధికార పార్టీలో  కేసీఆర్​ తప్ప ఇంకెవరూ లేకపోవడం వల్లే సీఎం రెండోసారి సాగర్​లో ప్రచారానికి రాబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి నేరుగా కేసీఆర్​ను టార్గెట్ చేసి పలు ఆరోపణలు చేయడమేగాక వాటికి ఆయన స్వయంగా ఆన్సర్​ ఇవ్వాలని కూడా సవాల్​ విసిరారు. అదీగాక ప్రస్తుతం టీఆర్ఎస్​ తరుపున ప్రచారం చేస్తున్న లీడర్లలో ఎవరు జానారెడ్డిని విమర్శించినా అది తమకే మైనస్​ అవుతోందని, అందువల్లే  కేసీఆర్​ పక్కా ప్లాన్​ ప్రకారం రెండోసారి టూర్​ పెట్టకున్నారని భావిస్తున్నారు. 

రెండోసారి ప్రచారానికి..
సీనియర్ ​నేత జానారెడ్డిని మంత్రి కేటీఆర్ విమర్శిస్తే అది రాజకీయంగా తమకు డ్యామేజీ అవుతుందని టీఆర్ఎస్​ హైకమాండ్​ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే 13,14 తేదీల్లో గుర్రం పోడు, హాలియా, పెద్దవూర మండలాల్లో నిర్వహించతలపెట్టిన రోడ్​షోను మంత్రి కేటీఆర్ క్యాన్సిల్​చేసుకున్నట్లు తెలుస్తోంది.  దీనిని బట్టి టీఆర్ఎస్ తన ఎన్నికల వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తుందో స్పష్టమవుతుంది. సాగర్​ నియోజకవర్గంలో జానారెడ్డి 11వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు జానారెడ్డిని విమర్శిస్తుంటే స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. అందువల్ల జానాను డైరెక్ట్​గా ఢీకొట్టాలంటే  సీఎం కేసీఆర్ రెండోసారి ఎంట్రీ ఇవ్వక తప్పదని మరో బహిరంగ సభకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. 

కేసీఆర్ సభపైనే చర్చ
సాగర్​ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10న హాలియాలో జరిగిన బహిరంగ సభకు హాజరైన సీఎం కేసీఆర్ అనేక హామీలు గుప్పించారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి 14న హాలియాలోనే బహిరంగ సభ పెడ్తున్నారు. గతంలో ఒక నియోజకవర్గంలో ఇలా రెండుసార్లు ఎన్నికల ప్రచారానికి కేసీఆర్​వచ్చింది లేదు. దీనిని బట్టి సాగర్ ఎన్నికను కేసీఆర్ సీరియస్​గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. కాగా, మొదటి సభలో ఎన్నికల హామీలు గుప్పించిన సీఎం కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే దానిపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి నేరుగా కేసీఆర్​ను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారు. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి సాగర్​లో ఎప్పుడో జరిగిందని  గణాంకాలతో సహా జానారెడ్డి వివరించారు. అయితే తాను విసిరిన సవాల్​కు సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని, వేరేవాళ్లు చెబితే తాను అంతగా పట్టించుకోనని కూడా జానా అన్నారు. అందువల్ల 14న జరిగే సభలో కేసీఆర్ ప్రధానంగా జానారెడ్డిని టార్గెట్ చేసే అవకాశముందని భావిస్తున్నారు.