తెలంగాణలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేసేందుకు సహకరించాలని సూచించిన సీఎం కేసీఆర్.. తన ఫామ్ హౌస్కు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌస్లో తనను కలిసిన గ్రామ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఈ వివరాలు తెలియజేశారు.
మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పంచాయితీ రాజ్ అధికారులకు సాధారణ ప్రజల మాదిరిగానే సీఎం కేసీఆర్ తన నివాస గృహా వివరాలను స్వయంగా అందించారు. ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్ సీఎం కేసీఆర్ను కలిసి ఆయన నివాస గృహానికి చెందిన వివరాలను ఫొటోతో సహా ప్రత్యేకించిన అప్లికేషన్ TSNPB లో నమోదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదుచేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో ప్రాపర్టీ ల నమోదు దేశంలో మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమన్నారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు సీఎం కేసీఆర్.