హన్మకొండ: మహిళలంటే సీఎం కేసీఆర్ కు ఎనలేని గౌరవమని, మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంగళవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలను మంత్రి, ఇతర అతిథులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనాను విజయవంతంగా ఎదుర్కోవడంలో ఆశా వర్కర్లు, నర్సుల పాత్ర మరువలేనిదన్నారు. అంగన్వాఢీ కార్యకర్తలు లేకుండా గర్భిణీలు, శిశువుల ఆరోగ్యాన్ని సంరక్షించడం సాధ్యం కాదన్నారు. అందుకే వారి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారి జీతాలు పెంచారన్నారు. అంగన్వాఢీ కార్యకర్తలకు రూ.13,650, ఆయాలకు రూ.7,000, ఆశా వర్కర్లకు రూ.9,750 జీతాలు పెంచామన్నారు. ఏ రాష్ట్రంలో కూడా అంగన్వాఢీ, ఆశా వర్కర్ల జీతాలను ఈ స్థాయిలో పెంచలేదన్నారు. అది ఒక్క కేసీఆర్ కే సాధ్యమైందన్నారు.
కేసీఆర్ కిట్లు, డ్వాక్రా గ్రూపులకు లోన్లు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో, చిన్న తరహా పరిశ్రమలు పెట్టడంలో మహిళలను ప్రోత్సహించేందుకు పావలా వడ్డీ కి రుణాలు ఇవ్వాలని 187 కోట్లు కేటాయించామన్నారు. మహిళా యూనివర్సిటీ కోసం బడ్జెట్ లో 100 కోట్లు, మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం 1లక్షా 25వేల మందికి న్యూట్రీషియన్ కిట్స్ ఇవ్వాలని కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజినిక్ కిట్స్ ఇస్తున్నామన్నారు. రూ. 40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ పయ్యావుల లలిత, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడి టీచర్స్, ఆశా కార్యకర్తలు, అయాలు, ఆర్పీలు, మెప్మా తదితర రంగాల మహిళలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం: