సీన్ లో కనిపించని కేటీఆర్..మళ్లీ యాక్టివ్ అయిన హరీశ్

సీన్ లో కనిపించని కేటీఆర్..మళ్లీ  యాక్టివ్ అయిన హరీశ్
  • ఇటు పార్టీ, అటు ప్రభుత్వ పనుల్లో హరీశ్​ బిజీ బిజీ
  • ఆరోగ్య శాఖలో  కీ రోల్​.. ప్రగతి భవన్​లోనే అడ్డా
  • అన్ని రివ్యూలకు  ఆహ్వానిస్తున్న కేసీఆర్​
  • కీలకమైన కమిటీల్లో చోటు..హుజూరాబాద్​ బాధ్యతలు
  • నిన్న మొన్నటి వరకు హరీశ్​తో అంటీముట్టనట్టు..  
  • ఈటల బర్తరఫ్​తో సీన్​ చేంజ్​

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ మేనల్లుడు, టీఆర్​ఎస్​ ట్రబుల్​ షూటర్​ హరీశ్​రావు మళ్లీ యాక్టివ్​ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొదలైన ఆయన హవా ఈటల ఇష్యూ తర్వాత  పీక్​కు  చేరింది. ఈటల రాజేందర్​ను మంత్రివర్గంలోంచి బర్తరఫ్​ చేసినప్పటి నుంచీ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ హరీశ్​కు  ప్రాధాన్యం పెరిగింది. కేసీఆర్ కీలకమైన పనులన్నీ ​హరీశ్​కే అప్పగిస్తున్నారు. మరోవైపు వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్​కు​ ప్రయారిటీ తగ్గింది. పార్టీ రాజకీయాలకు బదులు ఆయన  సోషల్​ మీడియాకే పరిమితమయ్యారు. మూడేండ్లుగా టీఆర్​ఎస్​ పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలకు హరీశ్​రావు దూర దూరంగా ఉన్నారు. తన కుమారుడు కేటీఆర్​కు పాలనా పగ్గాలు అప్పగించే ఆలోచనతో కేసీఆర్​ కావాలనే  హరీశ్​​ను దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. కానీ.. ఇటీవలి పరిణామాలతో టీఆర్ఎస్​లో సంస్థాగత మార్పులు కనిపిస్తున్నాయి. అటు పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కేటీఆర్​కు బదులుగా హరీశ్​కు  కేసీఆర్​ పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. కేబినెట్​ సబ్​ కమిటీలు, కీలకమైన మీటింగ్​లు, పార్టీ తరఫున చేపట్టే ఆపరేషన్లన్నీ హరీశ్​కు అప్పగించడాన్ని చూస్తే ఇది స్పష్టమవుతోంది. శాఖాపరమైన రివ్యూలన్నింటా హరీశ్​ ప్రత్యక్షమవుతుంటే, సోషల్​ మీడియా ట్వీట్లు,  ప్రారంభోత్సవాల్లోనే కేటీఆర్​ కనిపిస్తున్నారు. టీఆర్​ఎస్​ పార్టీ వ్యవహారాలకు కూడా కేటీఆర్​ దూరంగా ఉంటున్నారు. ఈటల ఇష్యూలోనూ నో  కామెంట్​ అంటూ కేటీఆర్ దాటవేయటం గమనార్హం.

ఈటల బర్తరఫ్​తో మారిన సీన్  

ఈటల రాజేందర్​ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ప్రగతి భవన్​లోని మీటింగ్​లు, రివ్యూలన్నింటికీ హరీశ్​రావును సీఎం కేసీఆర్​ పిలుస్తున్నారు. కరోనా సెకండ్​ వేవ్​ రాష్ట్రాన్ని కుదిపేయటంతో హెల్త్ డిపార్ట్​మెంట్​ తరఫున పనులు చక్కదిద్దే  బాధ్యతలను హరీశ్​కు అప్పగించారు. హాస్పిటళ్లలో మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను సమీక్షించేందుకు ఆయన నేతృత్వంలోనే  కేబినెట్​ సబ్ కమిటీని నియమించారు. ఈటలను పంపించేయడంతో ఖాళీ అయిన ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్​రావుకు అప్పగిస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉంది.  ప్రస్తుతం ఈ శాఖ కేసీఆరే దగ్గరే ఉంది. దీంతోపాటు రేషన్ డీలర్ల కమీషన్, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీలోనూ హరీశ్​కు చోటు కల్పించారు. ప్రస్తుతం హరీశ్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కుటుంబీకుడు కావటంతో పార్టీ వ్యవహారాలన్నింటిలోనూ కేసీఆర్​కు నమ్మిన బంటు అనే ముద్ర ఆయనపై ఉంది. ఉద్యమ నేతగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, పార్టీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఈటల రాజేందర్​ను సాగనంపటం ద్వారా ఉద్యమ నేతలను పార్టీ నుంచి పంపిస్తున్నారనే చెడ్డపేరు రాకుండా.. కేసీఆర్​ మళ్లీ హరీశ్​​ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. 

చేదు రిజల్ట్స్​తో రీ ఎంట్రీ

రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్​ఎస్​ పార్టీ మొత్తం వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ చుట్టూ తిరుగుతూవచ్చింది.  కేసీఆర్​ కనుసన్నల్లో ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలన్నింటిలోనూ  కేటీఆర్​ జోక్యం పెరిగింది. సీఎంకు బదులుగా తానే యాక్టింగ్​ సీఎం హోదాలో ఆఫీసర్లు, మంత్రులందరితో కేబినెట్​ తరహా రివ్యూలు నిర్వహించారు. ఇదే  టైమ్​లో వచ్చిన జీహెచ్​ఎంసీ ఎలక్షన్  బాధ్యతలను కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్​కే అప్పగించారు. కానీ ఈ ఎన్నికల్లో చేదు ఫలితం రావటం, ఒక్కసారిగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవటంతో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో టీఆర్​ఎస్​కు  పెద్ద డ్యామేజీ జరిగిందని, పార్టీ నేతల్లో క్రమశిక్షణ అదుపు తప్పిందని కేసీఆర్​ గుర్తించారు. అందుకే ఆయన స్వయంగా మళ్లీ పార్టీ వ్యవహారాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గీత దాటుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను బండకేసి కొడుతానని వార్నింగ్​ ఇచ్చి తన లైన్​లోకి  తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. సాగర్​ బై ఎలక్షన్​తో పాటు, రెండు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రగతి భవన్​ నుంచి కేసీఆర్​ పర్యవేక్షించారు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార పర్వం, పోలింగ్​ వరకు నిత్యం పార్టీ లీడర్లతో ఫోన్లలో మాట్లాడుతూ పావులు కదిపారు. ఈ టైమ్​లోనే కేసీఆర్​ మళ్లీ హరీశ్​ రావును తెరపైకి తెచ్చారు. హైదరాబాద్–రంగారెడ్డి సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బరిలోకి దింపిన పీవీ కూతురు వాణీదేవిని గెలిపించే బాధ్యతలు ఆయనకు  అప్పగించారు. వరుసగా రెండు ఎమ్మెల్సీ సీట్లు, నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే సీటును టీఆర్​ఎస్​ గెలుచుకుంది. అప్పట్నుంచీ పార్టీ వ్యవహారాలు, ఎలక్షన్​ బాధ్యతల నుంచి కేటీఆర్​ను మెల్లమెల్లగా సైడ్​ ట్రాక్​లో పెట్టినట్లు ప్రచారంలో ఉంది.

ఆపరేషన్​ హుజూరాబాద్​లోనూ..

ఈటల రాజేందర్​ రాజీనామాతో రాబోతున్న హుజూరాబాద్​ బై ఎలక్షన్​కు టీఆర్​ఎస్​  పావులు కదుపుతోంది. ఇప్పటికే హరీశ్​​రావుకు ‘ఆపరేషన్​ హుజూరాబాద్​’ ​బాధ్యతను కేసీఆర్​ అప్పగించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఉద్యమ నేత ఈటలకు బీసీలతో పాటు అన్ని వర్గాల్లో గట్టి పట్టుంది. అందుకే ఉద్యమ సహచరుడు, ఈటలకు సంబంధించిన గుట్టు మట్టులన్నీ హరీశ్​​కు తెలుసని పార్టీ నేతలు చెప్తున్నారు. అదే నమ్మకంతో  ఈటలను బర్తరఫ్​ చేసిన మరుసటి రోజే హరీశ్​​ను మళ్లీ ప్రగతిభవన్​ కు కేసీఆర్​ పిలిపించుకున్నట్లు చర్చించుకుంటున్నారు.