
సీఎం కేసీఆర్, మంత్రులు…అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఎల్ఆర్ఎస్ పై కలెక్టరేట్ల దగ్గర నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు, హక్కుల్ని ప్రభుత్వం పోలీసుల సాయంతో కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన నడుస్తోందా… పోలీసు రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. గడీకి పరిమితమైన కేసీఆర్ కు… ప్రజల గోడు కనిపించడం లేదన్నారు బండి సంజయ్.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన TRS మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారన్నారు ఎంపీ బండి సంజయ్. మున్సిపల్ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కరోనా సంక్షోభ సమయంలో LRS భారం మోపడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు. నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది అని అన్నారు. కేసీఆర్ పాలనలో హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమే అవుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తల్ని రాత్రి నుంచే అరెస్టు చేస్తూ… పోలీసులు విచక్షణారహితంగా దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కరెక్టరేట్ల ముట్టడి విజయవంతంతో….. ఉద్యమ స్ఫూర్తిని చాటారన్నారు బండి సంజయ్.