నిజామాబాద్ లో కొనసాగుతోన్న బీజేపీ నేతల అరెస్ట్

నిజామాబాద్ లో కొనసాగుతోన్న బీజేపీ నేతల అరెస్ట్

సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా పలు చోట్ల ముందస్తు అరెస్టులు, బస్సుల బంద్, అనధికారికంగా కొన్ని చోట్ల స్కూళ్ల బంద్  కొనసాగుతోంది. కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటారన్నా కారణాలతో ఇప్పటికీ జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు, ముంపు గ్రామాల ప్రజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఇప్పుడు పేస్కేల్ కోసం ఆందోళన చేస్తున్న  వీఆర్ ఏలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

కేసీఆర్  పర్యటనతో బోధన్ లో  NDSL ఫ్యాక్టరీ కార్మికులను పోలీసులు అర్ధరాత్రి పీఎస్ కు తరలించారు. సీఎం కేసీఆర్ సభకు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో NDSL ఫ్యాక్టరీని తెరిపిస్తామని MLC కవిత పలుమార్లు హామీ ఇచ్చారని, ఇప్పుడు కేసీఆర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని హామీ ఇవ్వాలని కార్మికులు, పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ అరెస్టులు సరికాదని ఫైర్ అవుతున్నారు.
 


అటు సీఎం టూర్ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. భైంసా నుంచి ప్రతి రోజు ఉదయం నుంచి నిజామాబాద్ కు  రెగ్యులర్ గా బస్సులు ఉంటాయి. అయితే సీఎం టూర్ ఉందని చెప్పి భైంసా నుంచి ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. సీఎం రాకతో నిజామాబాద్ కు బస్సులు రద్దు చేస్తున్నట్లు బస్టాండ్ లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనదారులు అందినకాడికి గుంజుతున్నారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు పలు విద్యాసంస్థల బస్సులను వాడుకోనుండడంతో నిజామాబాద్ లో కొన్ని విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. 

నిన్న మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాల కమిటీ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కు తమ గోడు చెప్పుకుందామన్నా అడ్డుకుని అరెస్ట్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మంచిప్ప రీ డిజైన్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపబోమంటున్నారు. ప్రస్తుతం ముంపు గ్రామాలు పోలీస్ పహారాలో ఉన్నాయి. మరోవైపు సీఎం నిజామాబాద్ టూర్ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్ట్ చేశారు.