అధికారంలోకి వస్తే దేశమంతా రైతు బంధు, ఫ్రీ కరెంట్ : సీఎం కేసీఆర్

అధికారంలోకి వస్తే దేశమంతా రైతు బంధు, ఫ్రీ కరెంట్ : సీఎం కేసీఆర్

కష్టాలు కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ హయాంలో తెలంగాణలో తప్ప దేశమంతటా కరెంటు కోతలే ఉన్నాయని విమర్శించారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదని కేసీఆర్ వాపోయారు. 

నీళ్ల కోసం యుద్ధాలెందుకు?

కేంద్రం నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి చోద్యం చూస్తోందని కేసీఆర్ విమర్శించారు. స్వాతంత్య్యం వచ్చిన 75ఏండ్ల తర్వాత కూడా నీటి యుద్దాలు ఎందుకని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్తవి మళ్లీ కట్టలేదని, ఏండ్లు  గడుస్తున్నా నీటి వివాదాలు పరిష్కారం కావడం లేదని అన్నారు. రేపో మాపో హరి అనేటోళ్లను ట్రైబ్యునళ్లలో కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మిషన్ భగీరథ తరహాలో ఐదేళ్లలో ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్

దేశంలో 4లక్షల10వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా..  తెలంగాణ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరెంటు సమస్య ఎందుకుందని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్​ భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో వెలుగుజిలుగులు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులను మోడీ అవమానిస్తున్నాడని, వారి తమ సమస్యల పరిష్కారం కోసం 13 నెలలు పోరాటం ఎందుకు చేయాలని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత కరెంటు ఇస్తామని స్పష్టం చేశారు. రైతు బంధును సైతం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.